సినిమాను తలపించేలా స్కెచ్..
నయా తరహాలో దొంగల ముఠా ప్లాన్
బ్యాంకు వెనుక నుంచి లోపలికి ప్రవేశం
అలారం మోగకుండా జాగ్రత్త
ఆధారాలు దొరక్కుండా సీసీటీవీల డీవీఆర్ అపహరణ
18.46లక్షల నగదు, 2.90కోట్ల విలువైన 6కిలోల బంగారం చోరీ
పెద్దపల్లి, మార్చి 25(నమస్తే తెలంగాణ)/మంథని రూరల్: గుంజపడుగు ఎస్బీఐలో భారీ చోరీ జరిగింది. సినిమా సీన్ను తలపించేలా బ్యాంక్లోకి ప్రవేశించి 18.46లక్షల నగదుతోపాటు 2.90కోట్ల విలువ చేసే 6కేజీల బంగారాన్ని వారు అపహరించుకొని పోయి పోలీసులకే సవాల్ విసిరారు.
తుమ్మ కట్టెలతో నిచ్చెన..
బుధవారం బ్యాంక్ కార్యకలాపాలు ముగిసిన తర్వాత సిబ్బంది అంతా ఇండ్లకు వెళ్లిపోయారు. బహుశా అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా గ్రామంలోకి ప్రవేశించింది. బ్యాంకు వెనుక ఉన్న వ్యవసాయ భూముల గుండా నడుచుకుంటూ తమకు అవసరమైన సామగ్రితో బ్యాంక్ కాంపౌం డ్ వద్దకు చేరుకున్నారు. ప్రహరీ 12 ఫీట్ల ఎత్తు ఉండడంతో అక్కడే ఉన్న తుమ్మ చెట్టును కొట్టి ఒక చిన్న నిచ్చెన తయారు చేసుకొని ప్రహరీ ఎక్కి బ్యాంక్ ఆవరణలోకి ప్రవేశించారు. గోడ లోపలి వైపు సైతం ఇటుకలను పేర్చి మెట్లలాగ చేసుకొని అందరూ లోపలికి దిగారు.
ఆధారాలు దొరక్కుండా..
ముందుగా బ్యాంకు వెనుకవైపు ఉన్న కిటికీని పగులగొట్టారు. ఊచలను తొలగించి లోపలికి వెళ్లారు. స్ట్రాంగ్ రూం తాళాలు పగులగొడితే అలారం రాకుండా ముందుగా దాని కేబుల్ను కట్ చేయడంతో పాటు బ్యాటరీలను తీసివేశారు. తర్వాత సర్వర్కు సంబంధించిన గదిలోకి వెళ్లి ఆన్లైన్ వ్యవస్థ ఏదీ పని చేయకుండా వైర్లన్నింటినీ కట్ చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్(డేటా వీడియో రికార్డర్)ను సైతం తమ వెంటే ఉంచుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ అంతా కలియదిరిగి, బ్యాంకు లాకర్లు ఉండే గది తలుపులను పగులగొట్టారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ (దాదాపు 25కిలోల బరువు), కట్టర్తో బ్యాంక్ లాకర్ తలుపును కట్ చేసి అందులోని నగదును, బంగారాన్ని తీసుకున్నారు. ఇంకా పూర్తిగా బ్యాంకు మొత్తాన్ని గాలిం చి డబ్బులు, బంగారం కోసం వెతికి మూట గట్టుకున్నారు. నిందితుల వేలి ముద్రలు కూడా ఎక్క డా దొరకకుండా జాగ్రత్త పడ్డట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక్కరిద్దరు కాకుండా ఒక గ్యాంగ్గా ఈ పనిచేసినట్లుగా నిర్ధారించారు. బ్యాంకులోని నగదు, బంగారాన్ని దోచుకొని వారు ఏ దారి నుంచి వచ్చారో అదే దారి గుండా వెళ్లిపోయారు. నిందితులు లాకర్లను తెరిచేందుకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ను మాత్రం బ్యాంకులోనే ఉం చిపోయారు. బ్యాంక్ మేనేజర్ ప్రహ్లాద్ పింగవా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, క్లూస్టీంతో తనిఖీలు నిర్వహించారు. నిందితులను గుర్తించేందుకు డాగ్స్కాడ్ను కూడా రంగంలోకి దించారు.
పోలీసులకే సవాల్
నిందితులు అత్యంత తెలివితేటలను ప్రదర్శించి బ్యాంక్లో చోరీ చేశారు. దాదాపుగా రూ.3కోట్ల విలువైన సొత్తును అపహరించుకుపోవడం, ఎక్కడా ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడడం పోలీసులకు సవాల్గా మారింది. రామగుండం కమిషనరేట్ పరిధిలోనే ఇప్పటి వరకు ఇంత పెద్ద చోరీ జరుగకపోవడంతో అందరి దృష్టి ఇప్పుడు గుంజపడుగుపైనే పడింది. ఇప్పటి వరకైతే పోలీసులకు గ్యాస్ సిలిండర్ మినహా ఏ ఇతర ఆధారాలు లభ్యం కానట్లు తెలియగా, ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.
ఫ్రొఫెషనల్ గ్యాంగ్ పనే:సీపీ సత్యనారాయణ
గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ చేసినట్లుగా గుర్తించామని సీపీ సత్యనారాయణ తెలిపారు. చోరీ విషయం తెలియగానే ఓ ఎస్డీ శరత్పవార్, పెద్దపల్లి జోన్ డీసీపీ పులిగిల్ల రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, ఏసీపీ ఉమేందర్, జైపూర్ ఏసీపీ నరేందర్ సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడారు. బ్యాంకు దొంగతనంలో ప్రొఫెషనల్ మ్యా నర్లో ఆధారాలు దొరకకుండా దొంగతనం చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్తో సహా మరికొన్ని సాంకేతికపరమైన ఆధారాలు లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కేసు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ప్ర త్యేకమైన 8పోలీసు బృందాలతో గాలింపు చర్య లు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి తరహాలో రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎప్పుడూ జరుగలేదని, వారికి సంబంధించి ఫింగర్ ప్రింట్లు సైతం లభించలేదని వెల్లడించిన ఆయన, ఈ కేసును తాము ఛాలెంజ్గా తీసుకున్నామని, అతిత్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.