నాడు అనేక సమస్యలతో సతమతం
పల్లె ప్రగతితో ఏడాదిలోనే మారిన స్వరూపం
మెరుస్తున్న వీధులు
ఆహ్లాదంగా ప్రకృతి వనం
తడిచెత్త, పొడిచెత్తతో సేంద్రియ ఎరువు
అభివృద్ధిలోనూ పరుగులు
బొప్పాపూర్ మురిసిపోతున్నది. దశాబ్దాల నాటి సమైక్య చీకట్లను తొలగించుకొని మెరుస్తున్నది. మొన్నటిదాక నిధుల లేమితో గ్రామంలో ఏ ఒక్క అవసరాన్నీ తీర్చుకోలేకపోయింది. కానీ పల్లె ప్రగతితో ఏడాదిన్నరలోనే తన రూపురేఖలు మార్చుకొని కొత్త శోభ సంతరించుకున్నది. అద్దాల్లాంటి రోడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్ నిర్మాణాలు, ఇంకా అనేక ప్రగతి పనులతో ఆదర్శంగా నిలుస్తున్నది.
బొప్పాపూర్ 4,328 జనాభా, 1280 నివాస గృహాలతో ఎల్లారెడ్డిపేట మండలంలోని అతిపెద్ద పంచాయతీల్లో ఒకటి. కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉంటుంది. అన్నీ పల్లెల్లాగే సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. గతుకుల రోడ్లు, చెత్త కుప్పలు, రోడ్ల వెంట పిచ్చి మొక్కలు, పారిశుధ్య లోపంతో సతమతమైంది. కానీ పల్లె ప్రగతితో ఏడాదిన్నరలోనే తన రూపురేఖలు మార్చుకున్నది. ప్రతి వీధిలో ఎల్ఈడీ విద్యుత్ దీపాలు అమర్చుకున్నారు. గ్రీన్ ఎవెన్యూ కింద 1200 మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. నర్సరీ ఏర్పాటు చేసుకొని 25 వేల మొక్కలు పెంచుతున్నారు. 300 కొత్త విద్యుత్ స్తంభాలు వేసుకున్నారు.
తీరొక్క వెయ్యి మొక్కలతో మల్లేశుని గుట్టపై పల్లె ప్రకృతి వనం తీర్చిదిద్దుకున్నారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్డును నిర్మించుకున్నారు. ఇంకా నిత్య పారిశుధ్య కార్యక్రమాలు చేస్తుండడం, ప్రజల్లోనూ చైతన్యం రావడంతో ఊరంతా శుభ్రంగా మారింది. ఒకనాడు పారిశుధ్య లోపంతో సీజన్ వస్తే చాలు వ్యాధులు విజృంభించగా, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. హరితహారం కింద గ్రామంలో 5వేల మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. రోజూ ఉదయాన్నే ఇంటింటా సేకరించే చెత్తతో కంపోస్ట్ షెడ్లో ఎరువును కూడా తయారు చేస్తూ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది.