చౌటకూర్, డిసెంబర్ 8 : వేరుశనగ సాగు లాభదాయకమని ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొంగ్లూర్ జనార్దన్ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. రైతులు ప్రస్తుతం వరి పంటనే అందరూ పండిస్తున్నారు. కానీ, వేరుశనగ సాగుచేయడంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని ఆయన తెలిపారు.వేరు శనగ విత్తన రకం కదిరి, లేపాక్షి 18,12 : కదిరి లేపాక్షి విత్తనం 18,12 బ్రీడర్ షీడ్ కదిరి నుంచి తెచ్చినట్లు తెలిపారు. ఇది వానకాలంలో నాలుగు నెలల కాల పరిమితిలో ఎకరా దిగుబడి కి 20 క్వింటాళ్లు వస్తుంది. యాసంగిలో నాలుగు నెలల పది రోజుల కాల పరిమితిలో ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు.
వేరుశనగకు అనుకూలమైన నేల : చెలక, ఎర్ర నేలలు, గరప నేలలు దీనికి అనుకూలం. ఈ పంట నల్ల రేగడిలో కూడా నిరభ్యంతరంగా పం డించుకోవచ్చు. మొదటి సారి ట్రాక్టర్తో దుక్కి దున్ని, మొదట ప్లవ్, రెండోసారి కల్టివేటర్, ఆ తర్వాత రోటోవేటర్ వేయాలి. విత్తనాలను షీడ్ డ్రిల్తో వేయాలి. పదిహేను రోజులకు ఒక సారి నీటి తడిని అందించాలి. అలా మొత్తం ఆరు దఫాలుగా తడిని పంటకు అందించాలి. పూత సమయంలో 25 కిలోల యూరియా,10 కిలోల గంధకం వేయాలి. అడుగు మందు ఆరు సింగిల్ సూపర్ పాస్పెట్, మూడు పొటాష్, ఆరు గోదావరి గోల్డ్ బస్తాలను వేయాలి. దీంతో ఒక మొక్క కు సుమారుగా 80 నుంచి 120 కాయలు కాస్తా యని రైతు జనార్దన్ తెలిపారు.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది..
ఎకరానికి సుమారు రూ. లక్ష ఆదాయం వరకు వస్తున్నది.. అందుకే వరి కన్నా వేరుశనగ సాగు ఎంతో లాభదాయకం. యాసంగిలో వేరుశనగ పంటనే వేశా. ప్రభుత్వం అందించే ప్రోత్సాహం బాగుంది. మాకున్న ఏడు ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ సారి వేరుశనగ పంటనే పండించి అత్యధికంగా 140 క్వింటాళ్ల దిగుబడి సాధించి ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యాను.
-గొంగ్లూర్ జనార్దన్ , ఉత్తమ రైతు అవార్డు గ్రహీత