టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రజా చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నెల రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ జట్టుతో చేరిన కోహ్లీ.. ఆసియా కప్లో అద్భుతంగా రాణించాడు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అంతర్జాతీయ సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే టీమిండియా మాత్రం గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇదే విషయాన్ని ఎత్తిచూపిన రమీజ్ రజా.. పాకిస్తాన్ సారధి బాబర్ ఆజమ్, కోహ్లీని పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ నుంచి టీమిండియా గ్రూప్ దశలోనే నిష్క్రమించినప్పటికీ.. డెడ్ రబ్బర్ అయిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేయడాన్ని భారత దేశం పొగిడిందని రమీజ్ రజా అన్నాడు.
‘కోహ్లీ సెంచరీ చేస్తే.. ఆసియా కప్లో టీమిండియా ఓటమిని కూడా భారత మీడియా, ఫ్యాన్స్ మర్చిపోయారు. కానీ ఇక్కడ బాబర్ సెంచరీ చేసినా విమర్శలు చేస్తూనే ఉంటారు’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. తాజాగా పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ కూడా రమీజ్ రజా వ్యాఖ్యలను తప్పుబట్టాడు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ‘అసలు లాజిక్ లేని వ్యాఖ్యలవి. అనవసరంగా కోహ్లీపై ఇలాంటి కామెంట్స్ ఎందుకు? తనేమీ సాధారణ ఆటగాడు కాదు కదా. ప్రపంచ క్రికెట్లో 70పైగా సెంచరీలు చేసిన రెండో ఆటగాడు’ అని చెప్పాడు. రమీజ్ రజా ఏదో చిరాకులో ఈ కామెంట్స్ చేసి ఉంటాడని బట్ అభిప్రాయపడ్డాడు. ఇవేకాకుండా ఇంకా చాలా అర్థంలేని మాటలు మాట్లాడాడని, ఇవన్నీ కూడా పసలేని కోతలేనని విమర్శించాడు.