తిరువనంతపురం: వారం కిందట కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత పీసీ చాకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరనున్నట్లు చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఎన్సీపీ భాగంగా ఉంది. దీనిపై చాకో స్పందిస్తూ.. కేరళలో రెండు ఫ్రంట్లు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోనిది కాగా మరొకటి లెఫ్ట్ది. ఇప్పుడు నేను కాంగ్రెస్ నుంచి వచ్చేశాను కాబట్టి నేనో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎల్డీఎఫ్కు మద్దతు ఇవ్వవచ్చు అని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను తాను కలవనున్నట్లు చాకో వెల్లడించారు. కేరళలో తాను ఎల్డీఎఫ్ తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం లేదంటూ ఈ నెల 10న పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.