పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అభిమానులు ఎలా ఎదురు చూస్తుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా గురించి అప్ డేట్ వస్తే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది పవన్ సినిమా ఫస్ట్ లుక్ కానీ.. టీజర్ కానీ వచ్చిందంటే రచ్చ రచ్చే. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఈయన ప్రస్తుతం అరడజన్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికే వకీల్ సాబ్ పనులన్నీ పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత క్రిష్ సినిమా కూడా అదే క్రమంలో వచ్చేస్తుంది.
ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయిన తర్వాత అంతకంటే భారీ అవకాశం దక్కించుకున్నాడు క్రిష్ జాగర్లమూడి. పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు చిన్న సైజ్ బాహుబలి చేస్తున్నాడు క్రిష్. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం. 200 ఏళ్ళ కింద స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. తొలిసారి తన కెరీర్ లో చారిత్రాత్మక కథతో వస్తున్నాడు పవర్ స్టార్. ఈ చిత్రం కోసం ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది.
నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసి అక్కడే ఈ సినిమాకు సంబంధించి కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు క్రిష్. ఇందులో హైదరాబాద్ పాత బస్తీ నుంచి కొందరు పహిల్వాన్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. వాళ్లతో పవన్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పాతబస్తీ పహిల్వాన్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది.
శతాబ్దాల కిందట్నుంచి అక్కడి కొన్ని కుటుంబాలు కుస్తీని వారసత్వంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు వీళ్లందరికీ తన సినిమాలో అవకాశం ఇస్తున్నాడు పవన్. కుస్తీ నేపథ్యంలో ఈ సినిమాలో భీకరమైన పోరాట సన్నివేశాలుంటాయని.. వాటినే క్రిష్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. మార్షల్ ఆర్ట్స్లో నైపుణ్యమున్న పవన్.. కుస్తీ సన్నివేశాల్లో ఎలా ఉంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా మార్చ్ 11న కోసం పవన్ అభిమానులు ఇప్పట్నుంచే చూస్తున్నారు.