అమరావతి ,జూన్ 4: ప్రముఖ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు మృతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన తుది శ్వాస విడిచారనే విషయం తీవ్ర విచారానికి లోను చేసిందని పవన్ అన్నారు. ‘కారా మాస్టారుగా తెలుగు భాషాప్రియులు, సాహిత్యాభిమానులు, రచయితలకు అభిమానపాత్రులు. కారా మాస్టారు పేరు చెప్పగానే ఆయన రాసిన ‘యజ్ఞం’ గుర్తుకు వస్తుంది. సమాజంలో అట్టడుగు వర్గాలవారి బతుకు చిత్రాన్ని, జీవన సమరాన్ని అక్షరాల్లో చూపించారు. పెత్తందారీ వ్యవస్థలో అణగారిన వర్గాలు, పేదలు దోపిడీకి గురవుతున్న వైనాన్ని ఆలోచన రేకెత్తించేలా చెప్పారు. తెలుగు కథా సాహిత్యం పట్ల వారు చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేం’ అని పవన్ పేర్కొన్నారు.
‘ప్రచురితమైన ప్రతి తెలుగు కథను భద్రపరచి, భావితరాలకు అందించేందుకు శ్రీకాకుళంలో కథా నిలయం నెలకొల్పి కారా మాస్టారు సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం. కారా మాస్టారు మృతి తెలుగు సాహిత్యానికి… ముఖ్యంగా కథా సాహిత్యానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.