తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాఢ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 18న ప్రవిత్ర ప్రతిష్ఠ, 19న పవిత్ర సమర్పణ, 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు
పవిత్రోత్సవాల కారణంగా 18 నుంచి 20వ తేదీ వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే 17న అంకురార్పణ సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేసింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.