జైపూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో ఇండియా లెజెండ్స్ బ్యాట్స్మెన్ జోరు కొనసాగుతోంది. దిగ్గజ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్(65 42 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(49 నాటౌట్ 20 బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లు) పరుగుల వరదపారించారు. వెస్టిండీస్ లెజెండ్స్తో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(35) మెరుపు ఆరంభం ఇవ్వగా ఆ తర్వాత సచిన్ తనదైన మార్క్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు.
వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన మహ్మద్ కైఫ్(27) ఫర్వాలేదనిపించాడు. ఇక ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన యువీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యూసుఫ్ పఠాన్(37 నాటౌట్: 20 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) రాణించాడు. విండీస్ బౌలర్ నగముటూ వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. పసలేని విండీస్ బౌలింగ్లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు.