హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అఖండ మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు మద్దతు ప్రకటించగా.. తాజాగా ఈ అలజడి ఆంధ్రప్రదేశ్కు తాకింది. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (సీవైఎఫ్) కూడా మద్దతు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సీవైఎఫ్ సమావేశంలో సీఎం కేసీఆర్కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సీవైఎఫ్కు దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు. కాకినాడ సమావేశానికి ఐదువేల మంది హాజరయ్యారు. 25 సంవత్సరాలుగా క్రిస్టియన్ యువతకు విద్య, ఉపాధి కల్పన, సామాజిక అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించే సీవైఎఫ్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేసీఆర్కు మద్దతు ప్రకటించడం విశేషం.
కేసీఆర్ సీవైఎఫ్ సంపూర్ణ సహకారం
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణలోని వివిధ సామాజికవర్గాల అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మతసామరస్యానికి కల్పిస్తున్న ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నట్టు సీవైఎఫ్ గుర్తించిందని సమావేశంలో పాల్గొన్న సభ్యులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ మాడల్ అమలుకావాలని కోరుకుంటున్నామని, అందుకే కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.
దేశంలో శాంతి, సామరస్యం కాపాడేందుకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలనుకోవడం హర్షణీయమని వెల్లడించారు. దేశంలోని పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కేసీఆర్ ముందుకు రావడాన్ని సీవైఎఫ్ సభ్యులు స్వాగతించారు. దేశంలో మతస్వేచ్ఛను కాపాడేందుకువస్తున్న కేసీఆర్కు ఆర్గనైజేషన్ తరపున అన్ని వేళలా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీవైఎఫ్ వ్యవస్థాపక డైరెక్టర్ రెవ బీహెచ్ వీ మూర్తిరాజు, తెలంగాణ సీవైఎఫ్ బాధ్యుడు రావులపాటి మోసెస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాకినాడలో సీవైఎఫ్ సమావేశంలో కేసీఆర్కు మద్దతుగా చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని తెలంగాణ ఎమ్మెల్సీ రాజేశ్వర్రావుకు అందజేశారు. ఈ పత్రాన్ని సీఎం కేసీఆర్కు అందజేయాలని సభ్యులు కోరారు.
కేసీఆర్ గారి హృదయ వాంఛ నెరవేరాలి
‘తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్రావుగారు భారతదేశ పార్టీ ప్రారంభించాలనే ఆశతో ఉన్నారు. వారి హృదయ వాంఛను, కోరికను సిద్ధింపజేసి, వారి ఆలోచన యావత్తును సఫలం చేసి, కుల, మత ప్రసక్తిలేకుండా అందరూ సమానులే అని రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులను కాపాడుతామనే ఆలోచనతో ఉన్నటువంటి చంద్రశేఖర్రావు హృదయ వాంఛ నెరవేర్చి, అతి త్వరలో కార్యక్రమాలను జరిపించుమని, ఏది శ్రేష్ఠ గలదో.. ఏదీ ఏకకరమైనదో, ఏదీ మేలుకరమైనదో ప్రభువా యోచించి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధము చేయుమని, మత స్వాతంత్య్రం కలిగిన లౌకిక రాజ్యములో స్వేచ్ఛ లేకుండా ఉన్నటువంటి మైనార్టీలకు అండగా, కొండగా ఉంటానని అభయమిస్తూ భారతదేశ పార్టీని ప్రారంభించడానికి సిద్ధపడిన కేసీఆర్ గారిని, వారి మంత్రి మండలిని దీవించాలని కోరుతున్నాను ప్రభువా’అని ప్రార్థించారు.
సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించే జాతీయ రాజకీయ పార్టీకి సీవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశాం. సెక్యూలరిజాన్ని, పౌరుల ప్రాథమిక హక్కులు, మత సామరస్యాన్ని కాపాడే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ స్థాపించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ నాయకత్వంతో దేశ ప్రజలందరికీ తెలంగాణ మాడల్ అభివృద్ధి ఫలాలు అందుతాయని మా నమ్మకం. తెలంగాణలోని మతసామరస్యం దేశవ్యాప్తంగా పరిఢవిల్లే అవకాశాలుంటాయి.
– రెవ బీహెచ్ వీ మూర్తిరాజు, సీఐఎఫ్ వ్యవస్థాపక డైరెక్టర్