లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగియనుంది. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ జరగనుంది. తొలి మూడు దశల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇక నాలుగో దశలో 624 మంది అభ్యర్ధులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి పట్టున్న లక్నో, రాయ్బరేలి ప్రాంతాల్లో ఇదే విడత పోలింగ్ జరగనుండటంతో నాలుగో దశ ఆయా పార్టీలకు రాజకీయంగా కీలకంగా మారింది. అవధ్ ప్రాంతంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ధారణ కావడంతో నాలుగో దశ పోరును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఫిలిబిత్, లఖింపూర్ ఖేరి, సీతాపూర్, హర్దోయ్, లక్నో, రాయ్బరేలి, ఫతేపూర్, బందా జిల్లాల్లోని 60 అసెంబ్టీ స్ధానాలు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. వీటిలో 16 స్ధానాలు ఎస్పీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా 58 స్ధానాల్లో ఎస్పీ అభ్యర్ధులు పోటీలో ఉండగా మరో రెండు స్ధానాల్లో ఓం ప్రకాష్ రాజ్భర్ పార్టీ బరిలో నిలిచింది. బీఎస్పీ, కాంగ్రెస్ మొత్తం 60 స్ధానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 57 స్ధానాల్లో ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) మూడు స్ధానాల్లో బరిలో నిలిచింది. ఇక ప్రచారపర్వానికి వస్తే సీఎం యోగి ఆదిత్యానాధ్ రాయ్బరేలిలో బహిరంగ సభలో పాల్గొనగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హర్దోయ్, రాయ్ బరేలి, సుల్తాన్పూర్, అమేథిల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఇక యూపీలో మిగిలిన దశల ఎన్నికలకు ఎస్పీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ పేరు చేర్చారు. ఎస్పీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, డింపుల్ యాదవ్ తదితరులున్నారు. కాగా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తొంది. మరోవైపు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.