భోపాల్ : ప్రియుడి ఫోన్ నంబర్ను డిలీట్ చేయలేదని కూతురిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గోనే జిల్లాలో మార్చి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 17 ఏండ్ల బాలిక.. స్థానికంగా ఉన్న అబ్బాయితో ప్రేమలో పడింది. అతనితో తరుచుగా ఫోన్తో మాట్లాడుతోంది. ఈ విషయాన్ని గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అతని ఫోన్ నంబర్ డిలీట్ చేయాలని ఆదేశించారు. కానీ బాలిక తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టింది.
దీంతో మార్చి 16న రాత్రి బాలికను ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో పాటు ఇద్దరు బంధువులు కలిసి హత్య చేశారు. ఒక రోజు ఇంట్లోనే డెడ్బాడీని పెట్టుకున్నారు. మరుసటి రోజు స్థానికంగా ఉన్న చెరువులో పడేశారు. అదే రోజు తమ కూతురు అదృశ్యమైందని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్చి 18వ తేదీన బాలిక మృతదేహం నీటిపై తేలియాడంతో.. ఆ డెడ్బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్బాడీకి పోస్టుమార్టం నిర్వహించగా.. ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. అమ్మాయిని తామే హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ కేసులో తల్లిదండ్రులతో పాటు సోదరుడు, ఇద్దరు బంధువులను అదుపులోకి తీసుకున్నారు.