ఏ పనిని మొదలుపెట్టినా అందుకు తగిన కార్యదీక్ష, అంతఃకరణ శుద్ధి అవసరమని అంటారు పెద్దలు. లేకపోతే స్వార్థం ఆవహిస్తుంది. చేస్తున్న పనిని నిష్ఫలం చేస్తుంది. ఆ కఠోర సత్యాన్నే ‘నూరు నోములు నోసి.. ఉచ్చల చేయి గడిగినట్టు’ అనే సామెత రూపంలో చెప్పారు. ఇలాంటి వ్యక్తులు నిత్యం తారసపడుతూనే ఉంటారు. ఏదో ఒక పెద్దపనిని భుజాన వేసుకొని ఎంతో కష్టపడతారు. దాన్ని ఓ యజ్ఞంలా కొనసాగిస్తారు. తీరా కొంచెపు బుద్ధి కొద్దీ ఆ పనినే అపవిత్రం చేస్తుంటారు. అలా వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఓ వ్యక్తి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి నూరు నోముల వ్రతం మొదలు పెట్టాడట. తొంభై రోజులపాటు బాగానే చేసినా, ఆ మరుసటి రోజు ఏదో అపవిత్రమైన
పని చేశాడట. అలా నూరు నోముల ప్రతిఫలాన్ని నిష్ఫలం చేసుకున్నాడు. ఇంకేముంది ఇన్నాళ్లూ తాను చేసిన పని లక్ష్యం ‘బూడిదలో పోసిన పన్నీరు’ అయింది. అందుకే, మంచిగా బతకాలంటే స్వార్థపు బుద్ధిని విడనాడాలి.
…?డప్పు రవి
బొమ్మలు: మృత్యుంజయ్