పంట మార్పిడికి ప్రోత్సాహకంగా
300 కోట్లతో ఏర్పాటుకు నర్మెటలో శంకుస్థాపన
ఆయిల్పామ్ సాగు పెంపులో కీలక ముందడుగు
తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీకి కండ్ల మంటలు
కాంగ్రెస్ నేతలకు సిగ్గు లేదు: హరీశ్ మండిపాటు
ఆయిల్పామ్తో ఏటా ఎకరాకు లక్షన్నర ఆదాయం
వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి
సిద్దిపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): Paప్రభుత్వం స్వరాష్ట్రంలో మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్దిపేట జిల్లాలో శంకుస్థాపన చేసింది. నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో 60 ఎకరాల్లో నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి ఆర్థిక మంత్రి హరీశ్రావు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి పంట ముగియగానే వానకాలంలో 20 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట వేసేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచినట్టుగానే ఆయిల్ పామ్ సాగులో కూడా సిద్దిపేట ముందుంటుందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తొండాట ఆడుతున్నదని విమర్శించారు. ‘తెలంగాణలో యాసంగి పంట అంటేనే బాయిల్డ్ రైస్. రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువ, బియ్యం తక్కువ వస్తయి. పండే బాయిల్డ్ రైస్ ఇస్తామంటే రా రైస్ కావాలంటరు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు ఉన్నది కేంద్రం తీరు’ అని మండిపడ్డారు. రూ.2-3 వేలకోట్లు భారమైనా సరే యాసంగి ధాన్యం మొత్తం మనమే కొని రైతులను ఆదుకొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గొప్ప నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు.
అభివృద్ధిలో మనమే నంబర్ వన్
దేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన, అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వమే నంబర్ వన్గా ఉన్నదని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆర్థిక వృద్ధిరేటు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుకు ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయం, రూ.5 లక్షల రైతు బీమా, వరి ఉత్పిత్తి, వైద్యం.. ఇలా దేనిలోనైనా తెలంగాణ రాష్ట్రమే మొదటిస్థానంలో ఉన్నదని వివరించారు. ఆ ఈర్ష్యతోనే తెలంగాణపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకొని నష్టపోయి, వారిలో అశాంతి రేగాలని బీజేపీ చూస్తున్నదని మండిపడ్డారు.
‘తెలంగాణకు బీఆర్జీఎఫ్లో కేంద్రం రూ.1,350 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికి 50 సార్లు దరఖాస్తులు పెట్టినం. అయినా పైసా ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెడితే రూ.25వేల కోట్లు అప్పు ఇస్తమంటున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క మడి అయినా తడిసిందా? అని నిలదీశారు.
పత్తి విత్తనాల ధరల పెంపుతో పెను భారం
కేంద్ర ప్రభుత్వం బీటీ పత్తి విత్తనాల ధరలు పెంచటంతో రాష్ట్ర రైతులపై పెను భారం పడుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ర్టాలను సంప్రదించకుండానే ఒక్కో ప్యాకెట్పై రూ.43 పెంచారని ఆరోపించారు. ‘తెలంగాణలో రైతులు ఏటా కోటిన్నర పత్తి విత్తనాల ప్యాకెట్లు వినియోగిస్తున్నారు. రేట్ల పెంపుతో వారిపై పెను భారం పడుతుంది. దీనిపై రైతులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఏం సమాధానం చెప్తారు? విత్తనాల రేట్ల పెంపు మాకు ఆమో దం కాదు. న్యాయనిపుణులతో చర్చించి దీనిపై ముందుకు వెళ్తాం’ అని తెలిపారు. అర్థంపర్ధం లేని ఆరోపణలు తప్ప సన్నాసి మంత్రి కిషన్రెడ్డికి ఏదీ చేతకాదని ఎద్దేవా చేశారు.
పామాయిల్తో మస్తు లాభాలు
ఆయిల్ పామ్ సాగులో మంచి లాభాలున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 59 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు ఉన్నాయని చెప్పారు. ఆయిల్పామ్ టన్నుకు రూ.22 వేల ధర ఉన్నదని, పెట్టుబడి ఖర్చులు పోగా ఎకరానికి ఏటా రూ.1.50 లక్షలు లాభం వస్తుందని వివరించారు. ఆయిల్ పామ్లో కోకోను అం తర పంటగా వేసుకోవచ్చని, కోళ్లు, పశువులు పెంచుకోవచ్చని తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.