ఊరూరా గ్రామసభలు
చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు
కార్మికులు, అధికారులకు సన్మానం
మేడ్చల్ రూరల్ / కీసర / ఘట్కేసర్ రూరల్ / శామీర్పేట, జూన్ 18 : పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభలు నిర్వహించి, పల్లె ప్రగతిలో చేసిన పనులను సర్పంచులు వివరించారు. అలాగే పలు సమస్యలు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం, రావల్కోల్, డబిల్పూర్, ఎల్లంపేట తదితర గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు జరిగాయి. డబిల్పూర్లో సర్పంచ్ గీతాభాగ్యారెడ్డి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. మండల కేంద్రం శామీర్పేటలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఎల్లూబాయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సర్పంచ్ బాలమణి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి విరాళంగా ఆటోను అందజేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వాదేశాల మేరకు చేపట్టిన పనులపై చర్చ నిర్వహించి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాలు చేశారు.
ఎంపీటీసీ సాయిబాబు, ఉపసర్పంచ్ రమేష్, కో ఆప్షన్ సభ్యుడు ముజీబ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కీసర మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభ నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అధికారులు, పంచాయతీ సిబ్బందిని సర్పంచులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరాలక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, ఎంపీవో మంగతాయారు, సర్పంచులు పాల్గొన్నారు. ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ, మర్పల్లిగూడలో జరిగిన పల్లెనిద్ర కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అవుషాపూర్లో క్రీడా మైదానాన్ని ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. కొర్రెముల పంచాయతీ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులు, సిబ్బందిని సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ సన్మానించారు. అవుషాపూర్లో సర్పంచ్ కావేరి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
అవుషాపూర్లో క్రీడా మైదానాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ కావేరి