నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 9: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ఏడో రోజైన గురువారం మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీధులు, బస్తీలను శుభ్రపరిచారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. రూ.కోటి నిధులతో రామవరం – పలుగులతండాకు, రూ.2 కోట్లతో రామవరం-తిరుమలగిరికి రహదారి పనులకు శంకుస్థాపన, కొరిపెల్లిలో క్రీడాప్రాంగణంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్ల ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. డబ్బు ఏండ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలోనే చేసిందన్నా రు. ఆ అక్కసుతోనే ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాయని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పొట్టపల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతిలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నారు. క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించి యువకులతో క్రికెట్, వాలీబాల్ ఆడారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గట్టు గ్రామంలోని నర్సరీ, ఆధునిక వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కొత్తపల్లి మండలం ఎలగందులలో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు.