ల్లగొండ : ఉమ్మడి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండలో భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, సైదిరెడ్డి, ధర్మారెడ్డి, రాజయ్య, శంకర్ నాయక్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధి మా అజెండా..
నామినేషన్ దాఖలు సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అభవృద్ది తమ అజెండా అని.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు దొంగ పార్టీలే అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నాడన్నారు. లక్ష ముప్పై వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ది అని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్నారు.