జనగామ/పాలకుర్తి : మహాకవుల జన్మస్థలాలు ప్రపంచానికి జ్ఞానఫలాలు పంచే అక్షర కేదారాలు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో దేవస్థానం, సోమనాథ కళాపీఠం సంయుక్త నిర్వహణలో ఆదివారం జరిగిన పాల్కురికి సోమనాథుని 782 వ లింగైక్య తిథి దీపారాధనలో దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సోమనాథుని విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
జ్ఞానసంపన్నుడైన సోమనాథుడు విశ్వకవి అని ఆయన కీర్తించారు. తెలుగు, దాక్షిణాత్య భాషలే కాక సంస్కృత, మరాఠీ భాషలలో సోమనాథుడు రాసిన కవిత్వం ఆ మహాకవి బహుముఖీన ప్రజ్ఞకు నిదర్శనం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మహాకవుల జన్మస్థలాలైన పాలకుర్తి, బమ్మెర గ్రామాలను పర్యాటక అక్షరాభ్యాస జ్ఞాన స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రధాన ప్రాంగణానికి సోమనాథుని పేరు పెట్టిన విషయం ఆయన గుర్తు చేసారు.
కార్యక్రమంలో సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, దేవస్థానం కార్యనిర్వణాధికారి ఎం వీరస్వామి, ప్రధానార్చకుడు దేవగిరి రామన్న, సూపరింటెండెంట్ కె వెంకటయ్య, తెలంగాణ అర్చక మతైక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ డి వి ఆర్ శర్మ, ఏసీపీ రమేశ్, సీఐ చేరాలు, ఎస్ఐ సతీశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మార్గం లక్ష్మీనారాయణ, కమ్మగాని నాగన్న, బండారి శ్రీనివాస్, దేవగిరి లక్ష్మన్న, మత్తగజం నాగరాజు, అనిల్ కుమార్, సంతోష్, శ్యాం, చిక్కమఠం పర్వతప్ప, రాపోలు శోభారాణి, ఇమ్మడి దామోదర్, గుమ్మడిరాజు సాంబయ్య, రాపోలు సోంసాయి, గూడూరు లెనిన్, బి అశోక్, ముంజె రాములు, మేరుగు మధుసూదన్, జి శ్రీనివాస్, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.