మహబూబ్నగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా పాలమూరును తీర్చిదిద్దాలని, అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(ఎన్ఐటీహెచ్ఎం) కార్యాలయంలో మంత్రి మినీ ట్యాంక్బండ్, శిల్పారామం పనులపై సమీక్ష నిర్వహించారు. మహబూబ్నగర్ పట్టణంలో నిర్మిస్తున్న మినీ ట్యాంక్బండ్, శిల్పారామం, నెక్లెస్రోడ్, ఐలాండ్, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ట్యాంక్బండ్ విస్తీర్ణం పెంచడంతో పాటు వాకింగ్ట్రాక్, బీచ్ స్పోర్ట్, లైటింగ్, ఎమినిటీస్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తగినట్లుగా పనులు చేపట్టాలన్నారు. ఐలాండ్ వరకు నిర్మించే సస్పెన్షన్ బ్రిడ్జి ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. ఐలాండ్లో మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. విమానయానశాఖ నుంచి పాత ఏయిర్క్రాప్ట్ను తీసుకొచ్చి ఐలాండ్లో ఉంచాలని, దీనిపై పర్యాటకులు ఎక్కి ట్యాంక్బండ్ కనపడేలా ఏర్పాటు చేయాలన్నారు. విమానం చుట్టూ ఫుట్పాత్, పక్కనే ఫిరంగులు, మిసైళ్లు ఉంచి ప్రత్యేక అనుభూతి కల్పిస్తామన్నారు. ఐలాండ్ మధ్యలో ఓ రెస్టారెంట్, సెల్ఫీపాయింట్ ఏర్పాటు చేసేలా డిజైన్ చేయాలన్నారు. శిలాతోరణం, చార్మినార్ తరహా ఆర్చీలు సిద్ధం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. సమావేశంలో పర్యాటకశాఖ ఎండీ మనోహర్, సంయుక్త కార్యదర్శి రమేశ్, నిథిమ్ డైరెక్టర్ డాక్టర్ చిన్నంరెడ్డి, అధికారులు అంజిరెడ్డి, ఓంప్రకాశ్, మహేశ్, రాజేశ్, టూరిజం కన్సల్టెంట్లు పాల్గొన్నారు.