శ్రీనగర్ : జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు పాక్ నుంచి డ్రోన్ ద్వారా జారవిడిచినట్లుగా భావిస్తున్నారు. ఇందులో ఏకే 47 రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 బుల్లెట్లు, టెలిస్కోప్ ఉన్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం అర్ధరాత్రి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని పహాలెన్ మండలం సౌజన్ గ్రామం వద్ద ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్, వస్తువులు జారవిడవడాన్ని గమనించిన ఓ గ్రామస్తుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు చెప్పారు. ఆపరేషన్ సమయంలో వైరస్తో కట్టిన పసుపు రంగు ప్యాకెట్ను గుర్తించామని, ఇందులో మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి.. వాటిని సేకరించేందుకు వచ్చిన వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
గత సంవత్సర కాలంగా పాక్ వైపు నుంచి భారత్లోకి డ్రోన్ కార్యకలాపాలు పెరిగాయి. ఇది భద్రతా దళాలకు పెద్ద సవాల్గా మారింది. గతేడాది ఏడాది కాలంలో రెండు డ్రోన్లను వేర్వేరు ప్రదేశాల్లో బలగాలు కూల్చి వేయగా.. పెద్ద ఎత్తున రైఫిల్స్, పేలుడు పదార్థాలు, బాంబులు, మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఏడాది జూన్లో జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై దాడి అనంతరం సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.