న్యూఢిల్లీ: ఇండియాలో తయారైన 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ పాకిస్థాన్కు పంపించనున్నారు. యునైటెడ్ గవి(GAVI) అలయెన్స్లో భాగంగా ఈ వ్యాక్సిన్లు పాకిస్థాన్కు వస్తున్నట్లు అక్కడి నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఫెడరల్ సెక్రటరీ ఆమిర్ అష్రఫ్ ఖవాజా అక్కడి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెల్లడించారు. గవి అనేది ఒక వ్యాక్సిన్ అలయెన్స్. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించేలా ప్రపంచంలోని సగం మంది పిల్లలకు వ్యాక్సినేట్ చేయడానికి ఈ అలయెన్స్ సాయం చేస్తుంది. కరోనా మహమ్మారి సమయంలోనూ ఈ గవియే పాకిస్థాన్కు సాయం చేస్తూ వస్తోంది.
పాకిస్థాన్కు కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడానికి గతేడాది సెప్టెంబర్లో గవీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 4.5 కోట్ల డోసుల వ్యాక్సిన్లలో 1.6 కోట్ల డోసులు ఈ జూన్నాటికి పాకిస్థాన్ వస్తాయని అష్రఫ్ ఖవాజా చెప్పారు. ఈ వ్యాక్సిన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ప్రశ్నించినప్పుడు.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నట్లు ఖవాజా తెలిపారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు వ్యాక్సిన్లను అందించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ గవీ అలయెన్స్లో భాగంగా పాకిస్థానీలకు మేడియన్ ఇండియా వ్యాక్సిన్లు వేయనున్నట్లు ఖవాజా చెప్పారు.