ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్లో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బిలావల్ భుట్టో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు జియో న్యూస్ కథనం వెల్లడించింది.
దాదాపు బిలావల్ పేరు ఖరారైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో వైపు ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్లో ఇమ్రాన్ ఖాన్, ఆయన మంత్రుల పేర్లను కోరుతూ దాఖలైన పిటిషన్పై సోమవారం ఇస్లామాబాద్ కోర్టులో విచారణకు రానున్నది. దీనిపై ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలవగా.. సోమవారం విచారణ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పతనం తర్వాత పాకిస్థాన్ తెహ్రీక్ -ఇ- ఇన్సాఫ్ పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా.. సీనియర్ నేతలు హాజరుకానున్నారు.