ఇస్లామాబాద్: అసలే అది పాకిస్థాన్. ఆ దేశంలాగే అక్కడి క్రికెట్ బోర్డు కూడా దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్లాంటి పెద్ద టీమ్ తమ దగ్గర ఆడటానికి రావడంతో నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని అనుకుంది. కానీ చివరి నిమిషంలో భద్రత ముప్పు అంటూ న్యూజిలాండ్ టూర్ రద్దు చేసుకొని వెళ్లిపోవడంతో ఆ ప్లాన్ కాస్తా చివరి నిమిషంలో బెడిసికొట్టింది. ఆ వెంటనే ఇంగ్లండ్ కూడా టూర్ రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయింది. ఇదంతా ఒకెత్తయితే.. లేకలేక ఓ పెద్ద క్రికెట్ టీమ్ తమ దగ్గరికి వచ్చిందని న్యూజిలాండ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
ఐదుగురు ఎస్పీలు, 500 మంది ఎస్ఎస్పీలను న్యూజిలాండ్ టీమ్ వెంటే ఉంచారు. వీళ్లకుతోడు పాకిస్థాన్ ఆర్మీని కూడా ఇస్లామాబాద్, రావల్పిండిలో రంగంలోకి దించారు. వాళ్లకు రోజూ రెండు పూటలా బిర్యానీలు పెట్టింది. ఇప్పుడా బిర్యానీల ఖర్చే రూ.27 లక్షలు అయిందని పీసీబీ లబోదిబోమంటోంది. అసలే టూర్లు రద్దు కావడం వల్ల తీవ్రంగా నష్టపోయామంటే.. ఇప్పుడు బిర్యానీలకే ఇంత మొత్తం చెల్లించాలా అంటూ పాక్ క్రికెట్ బోర్డు తల పట్టుకుంది.