Imran Khan | పాకిస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం శనివారం అర్ధరాత్రి హై డ్రామాకు తెర తీసింది. అనుక్షణం పరిణామాలు మారిపోతున్నాయి. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్ఖాన్ సర్కార్కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకపోవడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని పాక్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయమై పాక్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. మరోవైపు ఆఖరి క్షణాల్లో ఇమ్రాన్ఖాన్పై నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మొదలైంది. ఓటింగ్ ప్రారంభమైనప్పుడు సభలో ఇమ్రాన్ఖాన్ లేరని సమాచారం. ప్యానల్ స్పీకర్ ఆధ్వరంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ సాగుతున్నది.
మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా ఆర్మీ తన స్వాధీనంలోకి తీసుకున్నది. సుప్రీంకోర్టు ఆదేశం కోసం ఆర్మీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆదేశాలు వచ్చిందే తడవుగా అరెస్ట్లు జరిపేందుకు భారీగా బలగాలను మోహరించారు. పాక్ నేషనల్ అసెంబ్లీ ఎదుట ఖైదీల వాహనాలను నిలిపారు.
మరోవైపు ఇస్లామాబాద్, లాహోర్ నగరాల్లో ఇమ్రాన్ఖాన్కు అనుకూలంగా ప్రదర్శనలు జరిగాయి. ఇమ్రాన్ఖాన్ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన అధికార నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనధికారిక వార్తల ప్రకారం ఇమ్రాన్ఖాన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఇక గడువు ముగిసిన తర్వాత పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ తలుపులన్నీ మూసేశారు.