దేశ విభజన విషయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ భగ్గుమంది. విభజన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, అలాగే అవి అనుచిత వ్యాఖ్యలని పేర్కొంది. యూపీ ఎన్నికలతో పాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నికలు అతి దగ్గర్లోనే ఉన్నాయని, ఆ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజ్నాథ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తమను భయపెట్టాలని రాజ్నాథ్ చూస్తున్నారని దుయ్యబట్టింది. చారిత్రక వాస్తవాలను ఆయన ప్రశ్నిస్తున్నారని, ఉగ్రవాదం విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పాక్ విదేశాంగ శాఖ మండిపడింది.
1971 లో పాక్పై భారత సైన్యం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఇండియా గేట్ వద్ద జరిగిన స్వర్ణిమ్ విజయపర్వ్ కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మత ప్రాతిపదికన భారత దేశాన్ని విభజించడం ఓ చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలాపాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలను పాకిస్తాన్ ఇప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉందని, ఇలాంటి పనుల ద్వారా భారత్ను విచ్ఛిన్నం చేయాలని పాక్ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. అయితే 1971 లో భారత సైన్యం పాక్ ఆశలపై నీళ్లు చల్లిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలకు దీటైన సమాధానం భారత్ ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.