వికారాబాద్ జిల్లాలో 18,068 మంది రైతుల నుంచి 76,122 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
22వ తేదీతో పూర్తయిన కొనుగోళ్లు
రూ.149.2 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ
పరిగి, జూన్ 23 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ రకానికి రూ.1960, కామన్ రకానికి రూ.1940 చొప్పున మద్దతు ధర చెల్లించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ఏఈవోను నియమించి టోకెన్ల పంపిణీకి చర్యలు చేపట్టడంతో సజావుగా ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 5 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక క్లస్టర్కు ఒక డిప్యూటీ తహసీల్దార్ను ఇన్చార్జిగా నియమించారు. ఈ నెల 22వ తేదీతో జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 108 కొనుగోలు కేంద్రాల ద్వారా 18068 మంది రైతుల నుంచి 76122.86 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
రూ.149.2 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ
జిల్లా పరిధిలో గత యాసంగి సీజన్కు సంబంధించి రూ.149.2 కోట్ల విలువ చేసే 76122.86 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 108 కేంద్రాల్లో సర్కారు కొనుగోలు చేసింది.
ధాన్యం కొనుగోలు
ఆధ్వర్యం కేంద్రాలు రైతులు ధాన్యం(మె.ట)
ఐకేపీలు 23 3675 16742.5
పీఏసీఎస్లు 45 6512 30032.16
డీసీఎంఎస్లు 30 5508 21985.2
మార్కెట్ కమిటీలు 7 1510 4520
రైతు ఉత్పత్తి సంస్థలు 3 863 2843
ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటివరకు 28848.25 మెట్రిక్ టన్నులకు సంబంధించిన రూ.56,54,25,700 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మిగతా రూ.92.65 కోట్లు త్వరలోనే జమ చేస్తారు.
పూర్తయిన ధాన్యం కొనుగోళ్లు
– విమల, పౌర సరఫరాల శాఖ వికారాబాద్ జిల్లా మేనేజర్
జిల్లాలో గత యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యం కొనుగోలు 22వ తేదీతో పూర్తయింది. 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.149.20కోట్ల విలువ చేసే 76122. 860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 18068 మంది రైతుల నుంచి సేకరించాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్మిల్లులకు తరలించడం చేపట్టాం.