న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్ వరిపంట దిగుబడి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 16 శాతం అదనపు వరిపంటను సేకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్ మార్కెట్ సీజన్ సందర్భంగా నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 658 లక్షల మెట్రిక్ టన్నుల వరిపంటను సేకరించినట్లు కేంద్రం పేర్కొన్నది. మొత్తం కొనుగోళ్లలో ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే అదనంగా 30 శాతం పంట సేకరణ జరిగింది. ప్రస్తుత ప్రొక్యూర్మెంట్ విధానం వల్ల సుమారు 95 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఖరీఫ్ పంటల ధాన్యసేకరణ కోసం సుమారు లక్షా 24 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.పంజాబ్, హర్యానా, యూపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీఘడ్, జకే, కేరళ, గుజరాత్, ఏపీ, చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్నాటక, బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో వరిధాన్య సేకరణ సజావుగా సాగుతున్నట్లు కేంద్రం చెప్పింది.