హుజూరాబాద్, ఆగస్టు 7: ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శ్రీ హనుమాన్ రైస్మిల్లు నిర్వాహకుడు ఆకుల రమేశ్ ధాన్యాన్ని తూర్పుగోదావరి జిల్లా మందపేటలోని కృష్ణా తేజ పుడ్స్ రైస్ మిల్కి సరఫరా చేయాల్సి ఉన్నది. జూలై 21న లారీ కోసం పట్టణంలోని జ్యోతి లారీ ట్రాన్స్పోర్టు శ్రీనివాస్ను సంప్రందించాడు. అతడు కరీంనగర్లోని మహేశ్వరి లారీ ట్రాన్స్ఫోర్టు యజమాని లక్ష్మణ్ను అడుగగా 22న ఏపీ 31టీఎఫ్ 2286 నంబర్గల లారీని మిల్లుకు పంపించాడు. 23న 821 బస్తాలతో లోడు చేసిన లారీని డ్రైవర్ కగ్గ మురళి, క్లీనర్ రవి తీసుకొని మిల్లు నుంచి బయల్దేరారు. మరుసటి రోజు రమేశ్ మందపేటలోని మిల్లుకు ఫోన్చేసి ధాన్యం గురించి అడుగగా లోడ్ రాలేదని చెప్పా రు. డ్రైవర్ మురళి మొబైల్ నంబర్ 90322 90581కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మోసం జరిగిందని గ్రహించిన రమేశ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్ కేసును ఛే దించేందుకు ఎస్ఐ ఆసీఫ్, హెడ్కానిస్టేబుల్ ఓదె లు, కానిస్టేబుళ్లు రవి, శ్రీధర్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు రంగంలోకి దిగి ఆదివారం నిందితులను అదుపులోనికి తీసుకున్నారు.
లారీ ఓనర్ మాస్టర్ప్లాన్..
ధాన్యం చోరీ కేసులో గుంటూరుకు చెందిన భాస్కర్రావు సూత్రధారి అని సీఐ వెల్లడించారు. జూలై 17న భాస్కర్రావు డ్రైవర్ మురళిని పిలిచి వడ్లు దొంగిలించి అమ్ముకుందామని చెప్పగా సమ్మతించాడు. దీంతో భాస్కర్రావు.. మురళికి ఏపీ 31టీఎఫ్ 2286, ఏపీ 21టీబీ 3557 ఫేక్ నంబర్ ప్లేట్లు ఇచ్చాడు. మురళి ఒరిజినల్ లారీ నంబర్ ఏపీ 07టీహెచ్ 1816తో గుంటూరు నుంచి తీసుకొని వైజాగ్ పోయాడు. అక్కడి నుంచి బొగ్గు తీసుకొని జూలై 19 చంద్రపూర్ చేరుకున్నాడు. అకడ అన్లోడ్ అయ్యాక సాయత్రం భాస్కర్రావు మురళికి ఒక ఫోన్ తీసుకొమ్మని చెప్పగా చంద్రపూర్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఫోన్ను నంబరు 9032290581తో సహా తీసుకున్నాడు. దీంతో కేవలం ట్రాన్స్పోర్టు వారితో మాట్లాడుమని సూచించాడు. మురళిని కాగజ్నగర్ వద్దకి వచ్చి ఉండమని చెప్పగా బల్లార్ష, రాజుర్ల మధ్య వాగు ఉధృతితో అకడే ఆగాడు. భాస్కర్రావు సూచన మేరకు ఫేక్ నంబర్ ఏపీ 31టీఎఫ్ 2286 లారీకి ముందు, వెనుక పెట్టాడు. ఫోన్ నంబర్లు, ఫాస్టాగ్ తీసేశాడు. లారీ వెనుక, పక్కకు కనబడకుండా పెయింటింగ్ వేశాడు. అకడి నుంచి కాగజ్ నగర్కు చేరుకున్నాడు. అదేరోజూ కరీంనగర్ మహేశ్వరి గూడ్స్ లారీ ట్రాన్స్ఫోర్టు వాళ్లు ఫోన్ చేసి మందపేట వడ్ల లోడ్ ఉంది…వెళ్తవా అడుగగా మురళి సరేనన్నాడు. లారీని తీసుకొని కరీంనగర్కు వచ్చి మహేశ్వరీ లారీ ట్రాన్స్ఫోర్టు కార్యాలయంలో గుమస్తాని కలువగా అతను హుజూరాబాద్ వెళ్లి జ్యోతి లారీ ట్రాన్స్ఫోర్టు శ్రీనివాస్ని కలువమని చెప్పగా శ్రీ హనుమాన్ రైస్ మిల్లో లోడు కోసం లారీ పెట్టాడు.
మురళి ధాన్యం లోడు చేసుకున్న తర్వాత భాస్కర్రావు సూచనల మేరకు మిర్యాలగూడకు వచ్చే మార్గంమధ్యలో ఫోన్ స్విచ్ఛాప్ చేసి మరో ఫేక్ నెంబర్ ప్లేట్ ఏపీ 21టీబీ 3557 మార్చుకొని మిర్యాలగూడకు రమ్మని చెప్పాడు. జూలై 24న భాస్కర్రావు ఉదయం గుంటూరు నుంచి మిర్యాలగూడకి వచ్చి మురళిని కలిశాడు. వడ్లు శాంపిల్స్ తీసుకొని పంతంగి శ్రీనివాస్ ఏజెంట్ వద్దకి వెళ్లి తన వద్ద 33 టన్నుల వడ్లు ఉన్నాయి.. తీసుకుంటావా అని అడుగగా అతను శాంపిల్ చూసి లక్ష్మీ గణపతి రైస్మిల్కు పంపించాడు. భాస్కర్రావు, మురళి, క్లీనర్ రవి లారీలో శ్రీనివాస్ తన బైక్ పై లక్ష్మీ గణపతి రైస్మిల్లుకు వెళ్లి అకడ ధాన్యం దిగుమతి అయ్యాక ఏజెంట్ శ్రీనివాస్ వద్ద రూ.5.80 లక్షలు భాస్కర్రావు తీసుకొన్నాడు. అదే రోజు సాయంత్రం మిర్యాలగూడ దాటాక ఫేక్ నంబర్ ప్లేట్లను కృష్ణ నదిలో పారేసి తుమ్మల చెరువు టోల్ప్లాజా మీదుగా గుంటూరుకు చేరుకున్నారు. మురళికి రూ.50 వేలు, రవికి రూ.10వేలు భాస్కర్రావు ఇచ్చాడు. ఫిర్యాదు అందిన వెంటనే సీసీ ఫుటేజీల ఆధారంగా బసంత్ నగర్ టోల్ ప్లాజా, చంద్రపూర్వరకు వెళ్లి లారీ ఒరిజినల్ నంబర్ను గుర్తించి దాని ఆధారంగా ఈ కేసును ఛేదించామని సీఐ పేర్కొన్నాడు. ఓనర్ భాస్కర్రావు, డ్రైవర్మురళిని అరెస్ట్ చేయగా క్లీనర్ రవి పరారీలోనున్నాడు.