తెలంగాణలో వరి ప్రధాన పంట. ఈసారి సాగు మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. వానకాలంలో ఒక మోస్తరు వర్షాలు కురవడంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో కృష్ణా, గోదావరి నుంచి నీటిని సాగుకు మళ్లించింది. దీంతో రబీలో సాధారణం కంటే మూడింతలు.. అంటే దాదాపు 40 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. ప్రస్తుతం సాగైన వరి, 40 నుంచి 55 రోజుల (కలుపు, పిలక) దశల్లో ఉంది. ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వానకాలం కంటే చీడపీడల సమస్య తక్కువగానే ఉంటుంది. యాసంగిలో వానకాలం కన్నా 10 నుంచి 15 శాతం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎరువులు, పురుగుల మందు, కలుపు యాజమాన్య పద్ధతుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీనివల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. వరి సాధారణంగా ఎకరానికి 60:24:16 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్ సిఫార్సుగా ఉంది. రైతులు తమ పొలాల్లో సూటి ఎరువుల రూపంలో వేసుకోవాలనుకున్నప్పుడు 130 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెటు, 26 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడవచ్చు. రసాయన
ఎరువుల వినియోగం అనేది వాతావరణం, నేల, విత్తన రకాలపై ఆధారపడి ఉంటుంది. సిఫారసు చేసిన రెండోభాగం నత్రజనిని దుబ్బు చేసే దశలో, ఆఖరిభాగం నత్రజనిని చిరు పొట్ట దశలో పొటాష్ ఎరువులతో కలిపి వేసుకోవాలి.
అగ్గి తెగులు..
కొన్నిచోట్ల వరిని అగ్గితెగులు ఆశిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతల తగ్గుదల, గాలిలో అధిక తేమశాతం ఉంటున్నది. దీంతో వరి ఆశించిన స్థాయిలో పెరుగడం లేదని రైతులు నత్రజనిని అధికంగా వేస్తున్నారు. ఫలితంగా అగ్గితెగులు ఉధృతి ఎక్కువవుతుంది.
నివారణ చర్యలు : అగ్గి తెగులును ఆకుమచ్చ దశలో నివారించకపోతే ఆ తర్వాత దశలో మెడ విరుపు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తుంది. వరిపైరు చిరు పొట్టదశలో అగ్గితెగులు లక్షణాలు కనిపిస్తే ఆఖరి దఫా నత్రజని ఎరువును కొన్ని రోజులు తాత్కాలికంగా ఆపాలి. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పొటాష్ ఎరువును మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎకరానికి 15 కిలోలు చొప్పున వేయాలి. తెగులు ఉధృతి తొలిదశలో ఉన్నప్పుడు లీటర్ నీటిలో హైసో ప్రోథోలియన్ 1.5 మి.లీ. కలిపి లేదా లీటర్ నీటిలో కాసుగ మైసిన్ 2.5 నుంచి ఒక మిల్లీ లీటర్, ట్రైసైక్లోజోల్, మ్యాంకోజెబ్ 2.5 గ్రా. చొప్పున కలిపి 7 నుంచి 8 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఉధృతి మరింత అధికంగా ఉంటే మిశ్రమ శిలీంధ్రనాశిని అయిన పికాశి స్టోబిన్ 6.78తోపాటు ప్రొపికానా జోల్ 20.33 శాతం ఎస్.సి రెండు మి.లీ. లేదా ప్రాఫికొనజోల్ 10.7తోపాటు ట్రైసైక్లోజోన్ 34.2 శాతం ఎస్ఇ 1.మి.లీ లేదా టెబుకొనజోల్ ట్రైప్లాక్సిస్టోబిన్ 0.4 గ్రా. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కొత్త మిశ్రమ శిలీంధ్రనాశినులను పిచికారీ చేసేటప్పుడు ఇతర పురుగు మందులు కలుపకూడదు. అగ్గితెగులు కనిపిస్తే నీటిఎద్దడి లేకుండా చూడాలి.
డా. రఘురామిరెడ్డి, వరి ప్రధాన శాస్త్రవేత్త,
వరి పరిశోధనా విభాగం, వ్యవసాయ యూనివర్సిటీ