న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: మరో 50 ఏండ్లలో ఓజోన్ రంధ్రం పూర్తిగా కనుమరుగు అవుతుందని అమెరికా సముద్ర, వాతావరణ విభాగం (ఎన్ఓఏఏ) వెల్లడించింది. సూర్యుని నుండి భూమి మీదకు ప్రమాదకరమైన కిరణాలు ప్రసరించకుండా కాపాడే అంటార్కిటిక్ ఓజోన్ పొరకు ఏర్పడిన భారీ రంధ్రం 2070 నాటికి సంపూర్ణంగా మూసుకుపోతుందని ఎన్ఓఏఏ ఒక ప్రకటనలో తెలిపింది. సంక్లిష్టమైన వాతావరణ, రసాయనిక చర్యల వల్ల దక్షిణార్ధ గోళంలో ప్రతి వసంతకాలంలో ఓజోన్కు రంధ్రం ఏర్పడుతుంది. ఇటీవలి కాలంలో కాలుష్య కారకాల వాడకం తగ్గింపుతో పరిస్థితిలో మార్పు వస్తున్నది. క్రమంగా ఈ మార్పులు ఓజోన్ పొర రంధ్రం సమస్యకు శాశ్వత పరిష్కారానికి దారితీయొచ్చని ఎన్ఓఏఏ అంచనా వేస్తున్నది.