ముంబై : ఆక్సిజన్ లీకవగా.. వైద్య సిబ్బంది అప్రమత్తమవడంతో 14 మంది రోగుల ప్రాణాలు నిలిచాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భని జిల్లా హాస్పిటల్లో మంగళవారం అర్ధరాతి ఆక్సిజన్ సరఫరా చేసే పైపులైన్పై చెట్టుకొమ్మ పడిపోయింది. దీంతో పైప్నుంచి ఆక్సిజన్ లీకైందని అధికారులు బుధవారం తెలిపారు. వెంటనే గమనించిన సిబ్బంది రోగుల కోసం జంబో ఆక్సిజన్ సిలిండర్లను తరలించి, ప్రాణాలను కాపాడారని డెప్యూటీ కలెక్టర్ సంజయ్ తెలిపారు. లీకేజీతో మరమ్మతు కోసం ఆక్సిజన్ సరఫరా నిలిపివేయబడిందని, 2-3 నిమిషాల పాటు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వెంటనే సాంకేతిక నిపుణులు వచ్చి రెండు గంటల్లోనే మరమ్మతులు చేశారని చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని పేర్కొన్నారు. ఈ నెల 21న నాసిక్లోని ఆక్సిజన్ సరఫరా అంతరాయంతో 22 మంది మరణించిన విషయం తెలిసిందే.