పోడు భూములను సాగుచేస్తున్న రైతులకు భూయాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సమైక్య పాలనలో పోడు రైతులను అప్పటి పాలకులు పట్టించుకోలేదు. పోడు సాగుచేస్తున్న ఎస్సీ,ఎస్టీ, ఇతర వర్గాల రైతులకు న్యాయం చేస్తామని, భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామనే హామీ మేరకు సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతేడాది రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సంగారెడ్డి జిల్లాలో 3934, మెదక్ జిల్లాలో 4,503 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అర్హులైన రైతులను అధికారులు గుర్తిస్తున్నారు. జిల్లాల నుంచి నివేదికలు వెళ్లిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. సంగారెడ్డి జిల్లాలో 11 మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో 7109.24 ఎకరాల్లో , మెదక్ జిల్లాలో 85 హ్యాబిటేషన్లలో గిరిజనులు, గిరిజనేతరులు పోడు సాగుచేస్తున్నారు. వీరికి త్వరలోనే ప్రభుత్వం హక్కులు కల్పించి న్యాయం చేసే అవకాశం ఉంది.
సంగారెడ్డి/మెదక్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : పోడు భూములు సాగు చేస్తున్న రైతులు ఎంతోకాలంగా యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. సమైక్య పాలనలో పోడు రైతులు ఎంత వేడుకున్నా అప్పటి పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యపై దృష్టిసారించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల రైతులకు న్యాయం చేస్తామని, భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ భూ యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. గతేడాది పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల వివరాలను ప్రభుత్వం సేకరించింది. జిల్లాల వారీగా గిరిజన సంక్షేమశాఖ, ఫారెస్టు, రెవెన్యూ, పంచాయతీ, సర్వే శాఖల జిల్లా అధికారులతో జిల్లా, మండల స్థాయిలో కమిటీలు వేసింది. ఈ కమిటీ సభ్యులు పోడు భూములు సాగవుతున్న గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లాలో 3934 దరఖాస్తులు..
సంగారెడ్డి జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఉన్న 75 గ్రామాల్లో 7109.24 ఎకరాల్లో పోడు భూములు సాగవుతున్నాయి. ఇందులో 2168 మంది గిరిజనులు 4129.24 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన 1766 మంది రైతులు 2980 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం 3934 మంది తాము సాగుచేస్తున్న 7109.24 ఎకరాలపై పోడు భూములకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తులు అందజేసిన వారి లో చౌటకూరు మండలంలో 36 మంది రైతులు (62.12 ఎకరాలు), వట్పల్లిలో 308 మంది (320.02 ఎకరాలు), హత్నూరలో 379 మంది (348.28 ఎకరాలు), జిన్నారంలో 171 మంది (198.13 ఎకరాలు), ఝరాసంగంలో 83 మంది (108.36 ఎకరాలు), కోహీర్లో 391 మంది (747.17 ఎకరాలు), మొగుడంపల్లిలో 691 మంది (1901.03 ఎకరాలు), జహీరాబాద్లో 485 మంది (931.32 ఎకరాలు), కల్హేర్లో 1324 మం ది (2353.32), నారాయణఖేడ్లో 19మంది (47.36 ఎకరాలు), సిర్గాపూర్లో 47మంది రైతులు తాము సాగుచేస్తున్న 61.20 ఎకరాలకు పట్టాలు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. 3934 మంది రైతుల వివరాలను రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లా యంత్రాంగం పోడు భూములు సాగుచేస్తున్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తమకు అందజేసిన వివరాల ప్రకారం పోడు భూముల సాగు చేస్తున్న రైతులు స్థానికంగా ఉన్నదీ లేనిది పరిశీలించడంతో పాటు పోడు భూములను సర్వే చేస్తున్నా రు. రెవెన్యూ, గిరిజన సంక్షేమ, పంచాయతీ శాఖల సిబ్బంది భూసర్వేలో పాలుపంచుకుంటున్నారు.
మెదక్ జిల్లాలో 7,740 ఎకరాలు..
మెదక్ జిల్లాలో 21 మండలాల పరిధిలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని 82 పంచాయతీల పరిధిలోని 85 హ్యాబిటేషన్లలో గిరిజనులు, గిరిజనేతరులు మొత్తం 7740 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇందులో గిరిజనులు 2088 ఎకరాల్లో, ఇతరులు 5652 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పోడు భూములకు హక్కులు కల్పించాలని జిల్లాలో మొత్తం 4503 దరఖాస్తులు వచ్చాయి. అందులో 1212 మంది గిరిజనులు, 3291 మంది గిరిజనేతరులు ఉన్నారు. గతేడాది నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి అటవీ శాఖ అందజేసిన లెక్కల ప్రకారం మెదక్ జిల్లాలో భూవిస్తీర్ణం 2,78,649 హెక్టార్లు కాగా, దీనిలో అటవీ విస్తీర్ణం 57,623 హెక్టార్లు (20.68 శాతం ఉంది).
మెదక్లో పోడు భూములపై అవగాహన కల్పిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి
కో ఆర్డినేషన్ కమిటీకి శ్రీకారం..
ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పోడు సమస్యపై చర్చించి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, కమిటీ అధ్యయనం చేసింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అటవీ భూమి ఇక ముందు ఆక్రమణకు గురికాకుండా ఏకాభిప్రాయం తీసుకొచ్చేలా కమిటీ కృషి చేస్తుంది. పోడు సమస్య జిల్లాస్థాయిలో పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను సూచిస్తుంది. గిరిజన సంక్షే మ శాఖ ప్రకటించిన జిల్లా కో ఆర్డినేషన్ కమిటీలో చైర్మన్ గా జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఎస్పీ, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు), డీఎఫ్వో, డీఆర్డీవో, డీటీడీవో ఉండనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్ ఉంటారు. కన్వీనర్గా కలెక్టర్ వ్యవహరిస్తారు.
పోడు భూముల రైతులకు అవగాహన
మెదక్ రూరల్, అక్టోబర్ 12: మెదక్ మండలంలోని ఖాజీపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్వప్న సిద్దిరాములు యాదవ్, ఫారెస్ట్ బీట్ అధికారి మహేశ్గౌడ్ ఆధ్వర్యంలో పోడు భూముల రైతులకు బుధవారం అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఫారెట్ బీట్ అధికారి మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఖాజీపల్లి గ్రామంలో 310 దరఖాస్తులు ఉన్నాయని, 2005కు ముందు నుంచి అన్యాకాంత్రమైన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, 3 తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరుల దరఖాస్తులు గ్రామ స్థాయి కమిటీలో వారి సమీక్షంలో సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకే పోడు భూముల అభివృద్ధి నిర్వహణ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ రాజశేఖర్, నాయకులు సిద్దిరాంలు. గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే సర్వే పూర్తి..
సంగారెడ్డి జిల్లాలో 11 మండలాల్లోని 75 గ్రామాల్లో పోడు భూములు సాగు చేస్తున్నారు. 75 గ్రామాల్లో మొత్తం 3934 మంది రైతులు 7109.24 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 3934 మంది తాము పోడు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించి భూములను సర్వే చేస్తున్నాం. త్వరలోనే సర్వే పూర్తిచేసి వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం. అవి వచ్చిన తర్వాత రైతులకు అందజేస్తాం.
– ఫిరంగి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి, సంగారెడ్డి
జీపీఎస్ మిషన్తో సర్వే చేస్తాం
మెదక్ జిల్లాలో పోడు భూములకు సం బంధించిన సర్వేను జీపీఎస్ మిషన్తో చేపడుతున్నాం. జిల్లాలో పోడు సాగుదారుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పోడు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 7,740 ఎకరాల్లో పోడు సాగు చేస్తుండగా, 4,503 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోడు భూముల సర్వే పారదర్శకంగా చేపడుతున్నాం. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు సర్వేపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నాం.
– ఎస్.హరీశ్, కలెక్టర్, మెదక్