అబూజా: ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉన్మాది తుపాకీతో రెచ్చిపోయాడు. ఓండోలోని ఓ చర్చిపై (Church) దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది మరణించారని స్థానిక శాసనసభ్యుడు ఒలువోల్ వెల్లడించారు. మృతుల్లో చాలామంది చిన్నారులు ఉన్నారని చెప్పారు.
ఓండో రాష్ట్రంలోని ఓవోలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్లో ప్రజలు ప్రార్థనలు చేసుకుంటున్నారు. అయితే చర్చిలోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిగిపాడని తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారని, వారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. ఓవో చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని ఒలువోల్ చెప్పారు.