శ్రీవారి ఖజానాకు రూ.13,85,988 ఆదాయం
యాదాద్రి, జూలై 26: లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు చేపట్టి, ఉదయం ఆరగింపు నిర్వహించారు. స్వామివారికి నిజాభిషేకం నిర్వహించిన అనంతరం తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయంలోని ఉత్తర దిశలోని మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనారసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు.
సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి అమ్మవారి ఆశీస్సులు అందించారు. కొండకింద దీక్షాపరుల మండపంలో నిర్వహించిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రత మాచరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని 9వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. వివిధ విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.13,85,988 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
బంగారు తాపడానికి రూ.50,116 విరాళం
వలిగొండ, జూలై 26 : మండలంలోని మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాత బొడ్డు రాఘవరెడ్డి జ్ఞాపకార్థం స్వామి వారి రాజగోపురం బంగారు తాపడం ఏర్పాటుకు రూ.50,116 విరాళం అందించారు. కార్యక్రమంలో మొగిలిపాక సర్పంచ్ ముద్దసాని శశికళారెడ్డి పాల్గొన్నారు.
‘కోటి కుంకుమార్చన’కు ఏర్పాట్లు
యాదాద్రి పునఃప్రారంభం అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న ‘శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన’ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయ దక్షిణదిశ మొదటి ప్రాకార మండపాన్ని మంగళవారం ఆలయ అధికారులు శుద్ధి చేశారు. ఈ నెల 29న శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన’ కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా అమ్మవారిని అధిష్టింపజేసి అర్చన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో 30మంది రుత్వికులు, ప్రధానార్చకులు, అర్చకులతో పాటు భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దంపతులకు రూ.2వేల ప్రవేశ రుసుం ఉంటుంది. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటలు, సాయంత్రం 4నుంచి 7గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలు పేరిట సంకల్పం చేస్తారు. ఇలా భక్తుల పేరిట 30రోజుల పాటు పూజలు సంకల్పం నిర్వహిస్తారు. మొదటిరోజు పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం, కోటి కుంకుమార్చనలో ప్రత్యేకంగా పూజలు చేసిన లక్ష్మీఅమ్మవారి కుంకుమ ప్రసాదం అందిస్తారు. వీటితో పాటు స్వయంభూ నారసింహ స్వామి వారి ప్రత్యేక దర్శనం ఉంటుంది.