డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చిన్నారులపై కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. ఇటీవల అక్కడ కరోనా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కేవలం గత 10 రోజుల వ్యవధిలో తొమ్మిదేండ్ల లోపు వయసున్న 1000 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకిందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో కొంతమంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.
కాగా, ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది దేశంలో కరోనా మహమ్మారి కాలు మోపినప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఏడాది కాలంలో ఉత్తరాఖండ్లో కేవలం 2,131 మంది చిన్నారులు మాత్రమే కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చిన్నారుల్లో కరోనా స్పీడ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పదిహేను రోజుల వ్యవధిలో 264 మందికి మాత్రమే వైరస్ సోకగా.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మరో 15 రోజుల వ్యవధిలో 1,053 మంది వైరస్ బారినపడ్డారు.
ఇక, మే 1 నుంచి 14 వరకు కేవలం 14 రోజుల వ్యవధిలో 1,618 మంది చిన్నారులకు వైరస్ సోకింది. కాగా, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం 79,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 4,426 కరోనా మరణాలు సంభవించాయి.