న్యూఢిల్లీ : కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకాడ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో మూడో విడుతలో 18-44 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి వారికి ఈ నెల ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేస్తున్న విషయం తెలిసిందే. ఏజ్ గ్రూప్లో ఇప్పటి వరకు కోటి మంది లబ్ధిదారులకుపైగా వ్యాక్సిన్ వేసినట్లు సోమవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఇప్పటి వరకు 19.60 కోట్లకుపైగా మోతాదులు పంపిణీ చేసినట్లు చెప్పింది. సోమవారం ఉదయం వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. 28,16,725 సెషన్ల మొత్తం 19,60,51,962 మోతాదులను అందజేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇందులో 97,60,444 మంది ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, మరో 67,06,890 మందికి రెండో మోతాదు వేసినట్లు పేర్కొంది. 1,49,91,357 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి, మరో 83,33,774 మందికి రెండో మోతాదు.. 18-44 ఏళ్లలోపు 1,06,21,235 మంది లబ్ధిదారులు మొదటి డోసు వేసినట్లు చెప్పింది. 45-60 సంవత్సరాల మధ్య వయస్సున 6,09,11,756 మందికి మొదటి, 98,18,384 మందికి రెండో మోతాదు అందించినట్లు పేర్కొంది. 60 సంవత్సరాలు పైబడిన వారిలో 5,66,45,457 తొలి.. మరో 1,82,62,665 మందికి రెండో మోతాదు అందించినట్లు వివరించింది.
దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన వ్యాక్సిన్లలో ఏపీ, కేరళ, బిహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 66.30 శాతం వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 21.80 కోట్లకుపైగా వ్యాక్సిన్ మోతాదులు ఉచితంగా అందించిందని, ఈ నెల 23వ తేదీ వరకు వ్యర్థాలతో సహా 20,00,08,875 మోతాదులు వినియోగించినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 1.80కోట్లకుపైగా వ్యాక్సిన్ మోతాదులు (1,80,43,015) ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయని, రాబోయే మూడు రోజుల్లో 48లక్షలపైగా డోసులు సరఫరా చేయనున్నట్లు వివరించింది.