న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ ఈ మూడు నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ నినాదాల వల్లనే ఇప్పుడు భారతీయులు చైనా వస్తువుల వాడకాన్ని బాగా తగ్గించారని చెప్పారు. ఇవాళ మన్ కీ బాత్ 74వ ఎడిషన్లో భాగంగా ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. పల్లెపల్లెలో ఆత్మనిర్భర్ భారత్ నినాదం వినిపించాలని పేర్కొన్నారు.
ఎండాకాలం వస్తున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రధాని సూచించారు. సమస్త జీవుల మనుగడలో నీటికి ఎంత ప్రాధాన్యం ఉందో వివరించారు. అందువల్ల నీటిని ఆదా చేసుకోవడం మనందరి బాధ్యత అని ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా ఇవాళ సైన్స్ డే అనే విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రోజు సర్ సీవీ రామన్.. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టారని, అందుకుగాను ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిందని గుర్తుచేశారు. దేశ యువత తప్పనిసరిగా భారతీయ శాస్త్రవేత్తల గురించి, భారతదేశ సైన్స్ చరిత్ర గురించి చదవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తుండటాన్ని మోదీ మెచ్చుకున్నారు. రసాయన ఎరువులతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ తరహా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నదని చెప్పారు. అదేవిధంగా తమిళ సాహిత్యం గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. తాను సీఎంను, పీఎంను అయినప్పటికీ తమిళ భాష నేర్చుకోలేకపోయానని ఆయన విచారం వ్యక్తంచేశారు.