వేంసూరు, ఫిబ్రవరి 21 : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పాఠశాలతోపాటు ఆలయ అభివృద్ధికి కూడా తనవంతుగా సహకారం అందిస్తానని హెటిరో డ్రగ్స్ అధినేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు, పూర్వ విద్యార్థి బండి పార్థసారథిరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన తన స్వగ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని కందుకూరుకు వచ్చారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500 ఏండ్ల క్రితం గ్రామంలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. వచ్చే నెల 14 నుంచి 19 వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల కంటే ముందే ఆలయానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కందుకూరు ఉన్నత పాఠశాలలో చదివి ఈ స్థాయికి వచ్చానని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తన తల్లి బండి సోమ కాంతమ్మ పేరిట పాఠశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని ప్రకటించారు.