హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ‘విద్యార్థిగా రండి.. సివిల్ సర్వెంట్గా వెళ్లండి’ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ క్యాంపస్లో నెలలోగా సివిల్ సర్వీసెస్ అకాడమీని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓయూ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులు, సెంట్రల్ సర్వీసులతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి స్టేట్ సర్వీసులు, ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా దీనిని ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు.
అకాడమీలో దాదాపు 800 మంది విద్యార్థులు ఒకేసారి చదువుకొనే వసతి ఉంటుందని చెప్పారు. సివిల్స్కు అవసరమైన స్టడీ మెటీరియల్, రిఫరెన్స్ పుస్తకాలు, ఫర్నీచర్ తదితర ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయని వివరించారు. సివిల్స్తో పాటు రాష్ట్రంలో 80 వేలకు పైగా పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల స్టడీ మెటీరియల్ను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పేరొందిన పబ్లికేషన్ల మెటీరియల్ను తెప్పించడంతో పాటు సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా ఓయూ స్టడీ మెటీరియల్ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన, గ్రామీణ, తెలుగు మీడియం విద్యార్థులకు అకాడమీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సైఫాబాద్ పీజీ కాలేజీలోనూ పోటీ పరీక్షల స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.