92.66 శాతం నిధులు జీతాలు, పెన్షన్లకే..
అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలు పెంచడంతో పెరిగిన లోటు
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను బుధవారం నిర్వహించిన అకాడమీ సెనెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ. 682.22 కోట్లు, వ్యయం రూ.746.32 కోట్లుగా చూపెట్టారు. రూ.37.56 కోట్ల లోటుతో బడ్జెట్ను ఆమోదించారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.418.06 కోట్లు, మిగిలిన నిధులను వర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనున్నది. ఓయూ పరిపాలనా భవనంలోని అకాడమిక్ సెనెట్లో జరిగిన సమావేశంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర వాటిని వివరించారు. అనంతరం ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, కామర్స్ విభాగం ప్రొఫెసర్ వి. అప్పారావు బడ్జెట్ను ప్రవేశపెట్టగా, సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించారు.
రూ.418.06 కోట్ల బ్లాక్ గ్రాంట్..
ఓయూకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.418.06 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరవ్వగా, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.26.54 కోట్లు. వివిధ గ్రాంట్ల రూపేణా సర్కారు నుంచి రూ. 55.00 కోట్లు మంజూరైంది. మిగిలిన మొత్తం వర్సిటీ భరించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 33.94 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్ఆర్సీడీఈ, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్ తదితర సంస్థల నుంచి నిధుల మళ్లింపు ద్వారా రూ.144.52 కోట్లు, పెన్షన్ కార్పస్ ఫండ్పై వడ్డీ ద్వారా రూ.28 కోట్లు, లోన్లు, అడ్వాన్సుల వసూల ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.406.53 కోట్లు కాగా, పెన్షన్లకు రూ.285.00 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆకస్మిక అవసరాలకు రూ. 52.09 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.2.7 కోట్లు కేటాయించారు.
సింహ భాగం వేతనాలు, పెన్షన్లకే..
వార్షిక బడ్జెట్లో సింహభాగం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే సరిపోతోంది. ఉద్యోగుల వేతనాలకు రూ.406.53 కోట్లు అవసరముండగా, ఇది వర్సిటీ మొత్తం బడ్జెట్లో 54.47 శాతం కావడం గమనార్హం. అదేవిధంగా పెన్షన్లకు మరో రూ. 285.00 కోట్లు కేటాయించగా, ఇది 38.19 శాతంగా ఉంది. మిగిలినవాటిలో 6.87 శాతం కాంటింజెన్సీకి, 0.36 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. అయితే వేతనాలు, పెన్షన్లకు మొత్తం బడ్జెట్లో 92.66 శాతం పోతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ శాతం 65.75గా ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా వర్సిటీపై మరింత భారం పడింది.