బెంగళూరు: ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పరిపాలన సాగిస్తున్నదంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు మాటిమాటికి విమర్శిస్తుండటంపై బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప మండిపడ్డారు. వారు (ప్రతిపక్షాలను ఉద్దేశించి) ఆర్ఎస్ఎస్ పేరును ఎంత తలిస్తే, ఆర్ఎస్ఎస్ అంత బలం పుంజుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, తాను ఆర్ఎస్ఎస్ కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని యెడ్డీ నొక్కి చెప్పారు.
తానే కాదని, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆర్ఎస్ఎస్ కారణంగానే తానీ స్థానంలో ఉన్నాననే సంగతిని గర్వంగా చెప్పుకుంటారని యెడియూరప్ప వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచమంతా పొగుడుతుంటే.. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ఆయన గడ్డం గురించి అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.