న్యూఢిల్లీ, ఆగస్టు 16: బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేనంటూ విమర్శలు గుప్పించాయి. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా నారీశక్తి గొప్పతనంపై ప్రధాని మోదీ మాట్లాడిన గంటల్లోనే బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఎత్తిచూపాయి. 2002 గోద్రా ఘటన తర్వాత బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు పలువురు ఘనస్వాగతాలు పలుకడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. ఇవేనా అమృత మహోత్సవాలు అని ప్రతిపక్షాలు బీజేపీని నిలదీశాయి.
బీజేపీ ఆలోచనా ధోరణి నుంచే..
ఎర్రకోట సాక్షిగా మహిళల సాధికారత, భద్రత, గౌరవంపై మాట్లాడిన మాటలపై ప్రధానికి విశ్వాసం ఉందో లేదా దేశానికి చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా డిమాండ్ చేశారు. కథువా, ఉన్నావ్ కేసుల్లో రేపిస్టులకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేపిస్టులు, హంతకులను విడుదల చేయడం బీజేపీ చెబుతున్న నయా భారతం అని సీపీఎం విమర్శించింది. న్యాయం కోసం పోరాడే తీస్తా సీతల్వాడ్ వంటి వారిని జైలుపాలు చేయడం బీజేపీకే చెల్లిందని పేర్కొన్నది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తీవ్రంగా ఆక్షేపించారు. సామూహిక అత్యాచార ఘటనలో దోషులుగా ఉన్నవారిని విడుదల చేయడంతో బీజేపీ ఈ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నదో స్పష్టంగా తెలుస్తున్నదని ఎంఐఎం నేత ఒవైసీ విమర్శించారు. మహిళల గౌరవం, నారీశక్తి గురించి ప్రధాని మోదీ పెద్దపెద్ద మాటలు చెప్పుకొచ్చారని, అదే రోజున గుజరాత్ ప్రభుత్వం లైంగికదాడి కేసు దోషులను విడిచిపెట్టిందని అన్నారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి
గుజరాత్లో రేపిస్టుల విడుదలపై కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : గుజరాత్లో దోషుల విడుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలను గౌరవించండి.. నారీ శక్తిని సపోర్ట్ చేయండి అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని మండిపడ్డారు. ‘భాషన్: మహిళలను గౌరవించడం.. కామ్: క్షమాభిక్ష పేరుతో 11 మంది రేపిస్టులను ఒకేరోజు విడుదల చేయడం.. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఇది జరిగింది’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. విడుదలైనవారికి మిఠాయిలు పంచుతున్న ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.