హైదరాబాద్ : గ్రేటర్ వరంగల్ నగరంపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి కార్యాలయంలో 18 మందికి మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లితో కలిసి బీఫాంలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని డివిజన్లలో అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఉద్యమంలో చాలా మంది పని చేశారన్నారు. డీ లిమిటేషన్తో రిజర్వేషన్లు మారడంతో చాలా ఇబ్బందులెదురవుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో చాలా సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఇంకా జరగాల్సి ఉందని.. ఈ మేరకు ముందుకెళ్తున్నామన్నారు.
కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరిగిందని ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులు ఎంత? తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఎంత ఇస్తుందో చెబితే బాగుంటుందన్నారు. మనం చెల్లించిన మేరకు కేంద్రం మనకు చాలా ఇవ్వాల్సి ఉందన్నారు. వరంగల్ నగర అభివృద్ధిపై తమకు స్పష్టత ఉందన్నారు. వరంగల్కు రింగ్ రోడ్డు వచ్చిందని, మంచినీటి పథకాలు, డ్రైనేజీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ముంబై తర్వాత పుణెలా.. హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందనుందన్నారు. ఇప్పటికే ఐటీ టవర్క్ వచ్చాయని, ఇంకా చాలా వస్తున్నాయని చెప్పారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణలో పట్టణీకరణ గొప్పగా జరుగుతోందన్నారు. ఇందులో కొన్నింటిని ప్రధాన నగరాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.