జైపూర్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం రాజస్దాన్లోని బర్మార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ పంపిణీ చేయడం కలకలం రేపింది. గుడమలని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒపియం, పప్పీ హస్క్ వంటి నిషేధిత డ్రగ్స్ సేవించారని చీఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి ఓంప్రకాష్ విష్ణోయ్ వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన అనంతరం దాదాపు పదిమందికి పైగా పాఠశాలకు చేరుకుని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు. నిందితులు డ్రగ్స్ సేవిస్తున్నట్టు వైరల్ వీడియోల్లో కనిపించింది.
ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి నిందితులు ఎవరూ లేరని విష్ణోయ్ తెలిపారు. విద్యార్ధులు, టీచర్ల స్టేట్మెంట్ నమోదు చేసుకుని నిందితుల ఆచూకీ పసిగడతామని చెప్పారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని విష్ణోయ్ వెల్లడించారు.