హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని దేశంలోని ప్రజలతో పాటు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు సైతం కోరుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సరైన నాయకుడు ఆయననేనని, ఆయనతో దేశ రాజకీయాల్లోనే మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు జాతీయ స్థాయిలో కేసీఆర్కు పట్టం కట్టడం ఖాయమని పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ భారత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. దేశ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు, రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారని విశ్వసిస్తున్నాను. దార్శనికత, అనుభవం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అపారమైన పరిజ్ఞానం కేసీఆర్ సొంతం. గతంలో కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా విజయం సాధించి తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన రాష్ర్టాన్ని అనేక అంశాల్లో నంబర్ వన్గా నిలిపారు. భారతదేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహించడానికి దేశంలోనే అత్యంత బలమైన రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు. ఇప్పుడు కేసీఆర్ అనుభవం, ఆయన నాయకత్వాన్ని భారతజాతి ఉపయోగించుకోవాల్సిన సమయం అసన్నమైంది. జాతీయ రాజకీయాలకు ఆయన సేవలు కీలకం. ఈ దేశం ఎదురొంటున్న వివిధ సమస్యలను పరిషరించడంలో కేసీఆర్ ఇప్పుడు చాలా కీలకం. దేశాన్ని పాలించేందుకు భారత ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇచ్చారు. రెండు జాతీయ పార్టీల పాలనను చూశారు. ఇప్పుడు ప్రజలు వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన ఉత్తమ నాయకత్వంలో మూడో ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని నేను నమ్ముతున్నాను.
– డాక్టర్ జయపాల్ కదిరే, ్రప్రోగ్రాం మేనేజర్, సిడ్నీ, ఆస్ట్రేలియా. (నాగర్కర్నూలు జిల్లా, చేగుంట వాస్తవ్యులు)
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన తర్వాత కూడా ప్రజలకు సురక్షితమైన తాగునీరు, రైతులకు 24 గంటల విద్యుత్తు, పేదలకు ఇండ్లు లాంటి ప్రాథమిక అవసరాలను అందించడంలో మన దేశం భారీ సవాళ్లను ఎదురొంటున్నది. ఇతర దేశాలతో పోల్చినప్పుడు మనం పేదరికం, ఆరోగ్య సంరక్షణలో ఇంకా దిగువ స్థాయిలోనే ఉన్నాం. 75 ఏండ్లలో దేశాన్ని కాంగ్రెస్, బీజేపీయే ఎక్కువ కాలం పాలించాయి. ఆ రెండు పార్టీలు ప్రజలకు ప్రాథమిక అవసరాలను అందించడంలో విఫలమయ్యాయి. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై, ఎప్పటికప్పుడు కొత్త డైవర్షన్లతో వెళ్తున్నది. అన్ని మీడియాలను ఉపయోగించుకుని, గుజరాత్ అభివృద్ధి నమూనా పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ.. ప్రసంగాలు ఊదరగొట్టడం తప్ప సాధించింది ఏమీ లేదు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే, విశ్వసనీయత, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న నాయకుడు కేంద్రంలో అవసరం. ఆ నాయకుడు కేసీఆర్ అనేది నా అభిప్రాయం. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రారంభించి, తెలంగాణ ప్రజల కలలను ఆయనే నెరవేర్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందింది. తెలంగాణలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
– డాక్టర్ అనిల్ కుమార్ చేతి, ఆస్ట్రేలియా. (కరీంనగర్ వ్యాస్తవులు)
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తుండటం శుభపరిణామం. రాజకీయ చతురత, ప్రజాసంక్షేమం, అభివృద్ధి తదితర వాటిపై పూర్తి పట్టు ఉన్న ఓ మహాశక్తి కేసీఆర్. ప్రస్తుత తరుణంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అవసరం చాలా ఉన్నది. రాష్ట్ర సాధనతోపాటు అతి కొద్ది సమయంలోనే తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నంబర్వన్గా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కింది. ఆయన మాటల మనిషి కాదు కార్యసాధకుడు. కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలపై రైతులు, సామాన్య, పేద, అన్ని వర్గాల ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. వీరంతా కేసీఆర్కు అండగా ఉంటారు. అన్ని రాష్ర్టాల నుంచి కేసీఆర్కు మద్దతు ఉంటుందన్న బలమైన నమ్మకం నాకున్నది. కేసీఆర్కు గురువుగా నేను ఎంతో గర్వ పడుతున్నా. కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో విజయం సాధించటంతోపాటు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి.
– గన్నె బాల్రెడ్డి, సీఎం కేసీఆర్ గురువు (విశ్రాంత ఉపాధ్యాయుడు), దుబ్బాక, సిద్దిపేట జిల్లా
పరిపాలన పేరుతో యావత్ దేశాన్ని కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ వంటి గొప్ప విజన్ ఉన్న నేత, సంస్కరణల రూపకర్త సేవలు అత్యంత అవసరం. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇప్పటివరకు దేశ ప్రజలు కేసీఆర్ వంటి పోరాటయోధుడు, జాతిపిత మహాత్మాగాంధీకి నిజమైన వారసుడిలా అహింసాయుత పద్ధతులను అవలంబించే నాయకుడిని చూడలేకపోయారు. తెలంగాణ సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడేలా చేస్తున్న మహానేత సీఎం కేసీఆర్. ఎనిమిదేండ్ల కాలంలోనే రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిపాలనా సంస్కరణలు తీసుకురావడంతో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన కేసీఆర్ను దేశ రాజకీయాల్లోకి ప్రజానీకం ఆహ్వానిస్తున్నది. నిరుద్యోగం, అవినీతికి చరమగీతం పాడాలంటే కేసీఆర్ దేశానికి అత్యంత అవసరం.
– భూక్యా మహేందర్నాయక్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం సాధించి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇక పై జాతీయ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వస్తాయి. విపక్షాలు బలంగా లేని సమయంలో కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ప్రధాని మోదీకి దీటైన పోటీ ఇస్తారు.
-భగత్రామ్, లంగర్హౌస్
సీఎం కేసీఆర్ కేంద్రం ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. ఇన్నాళ్లు దేశంలో బలమైన విపక్షం లేకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇక మోదీకి ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, దేశ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామం.
– ప్రకాశ్ కుమావత్, లంగర్హౌస్