న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్మాన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో లాగే పంజాబ్లో కూడా ఆపరేషన్ లోటస్ అమలు చేయబోయారని, కానీ ఇక్కడ ఆ ఆపరేషన్ లోటస్ ఓటమిపాలైందని అన్నారు. పంజాబ్లో ఆప్ సర్కారు ఏర్పాటై ఆరు నెలలైనా కాకముందే.. బీజేపీ దాన్ని కూల్చేందుకు ప్రయత్నించి విఫలమైందని ఆరోపించారు.
ఇటీవల ఆప్ సర్కారును కూల్చేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్ల చొప్పున ఆఫర్ చేసిన బీజేపీ ఆపరేషన్ లోటస్కు తెరతీసింది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ క్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్ అనుమతితో అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించారు.
ఈ ఉదయం సెషన్ ప్రారంభం కాగానే సీఎం భగవంత్ మాన్ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సభలో చర్చించాల్సిన అంశాలను పక్కనపెట్టి సీఎం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. అయినా 91 మంది ఆప్ ఎమ్మెల్యేలు, ఒక శిరోమణి ఎమ్మెల్యే, ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో విశ్వాస తీర్మానం నెగ్గింది. అనంతరం సీఎం మాన్ మీడియాతో మాట్లాడారు.