టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీని గద్దె దించే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని, ఈ తరుణంలో దేశానికి కొత్త పార్టీ అవసరమని, అది కేసీఆర్ నాయకత్వంలోనే రావాలని ఎన్నారైలు బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఆస్ట్రియాలో ఎన్నారైలతో సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్తో జూమ్ మీటింగ్ నిర్వహించాలని, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ ఎజెండా.. ప్రజల ఎజెండాపై స్వయంగా ఆయనే దిశానిర్దేశం చేయాలని ఉత్తర భారత ఎన్నారైలు కోరుతున్నారని మహేశ్ వెల్లడించారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషిస్తున్నదని, దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా ఉండాల్సిందేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ముందుపెట్టిన ఎజెండాకు ఎన్నారైల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే అభిప్రాయం ఎన్నారైల్లో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్ఎస్ ఆస్ట్రియా కార్యవర్గ సభ్యులు అనుమాండ్ల లక్ష్మారెడ్డి, బొల్లాడి లక్ష్మారెడ్డి, సంతోష్, కంది వంశీ, కోరండ్ల ప్రవీణ్, రంగు మహేశ్, దోర్నాల సంతోష్, శ్రీనివాసరావు, రమేశ్, అశోక్, భరత్, సత్యజిత్, రూపేశ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.