మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. ఇప్పటివరకు పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్లో రాసుకుని ఆన్లైన్ చేస్తుండగా, చాలామంది ఫీల్డ్కు వెళ్లకుండానే మ.మ. అనిపించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా సర్వే నంబర్లు, రైతుల వారీగా కచ్చితమైన సమాచారం నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏఈఓ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 17 అంశాలతో ఉన్న ఈ అప్లికేషన్లో వానకాలం సీజన్కు సంబంధించిన వివరాలను ఏఈఓలు నమోదు చేస్తున్నారు. ఎంట్రీ చేసిన వెంటనే సమాచారం ఉన్నతాధికారుల వరకు క్షణాల్లో చేరుతున్నది. ఏ పంట వేశారు, ఏ దశలో ఉంది, చీడపీడలు ఏమైనా ఆశించాయా? దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉందన్నది ఇట్టే తెలిసిపోతున్నది. తద్వారా మార్కెటింగ్ సదుపాయాల కల్పనకూ వీలుకానున్నది.
సూర్యాపేట, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖ నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. పంటల సాగు విషయంలో యాత్రీకరణలో ముందుంటున్న ఈ శాఖ ఆధునిక పద్ధతులతో రైతుల సేవలో అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటివరకు రైతుల పంటల వివరాలను ఏఈఓలు కాగితాల్లో అనంతరం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఏఈఓ యాప్ పేరిట ఓ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది వ్యవసాయ అధికారులకు బహుముఖ ప్రయోజనకారిగా మారుతున్నది. ఏ అంశాన్ని యాప్లో అప్లోడ్ చేసినా క్షణాల్లో ఉన్నతాధికారుల వరకు చేరుతుంది. వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఈఓలు ఏయే కార్యకలాపాలు నిర్వహిస్తున్నది తెలిసిపోతుంది.
హాజరుతోపాటు 17 అంశాలతో..
ఏఈఓలు రైతు వేదిక క్లస్టర్ గ్రామాల్లోకి అడుగు పెట్టాకే బయోమెట్రిక్ ఆప్షన్ చూపిస్తుంది. హాజరుతోపాటు మొత్తం 17 అంశాలను ఈ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఏఈఓలు రైతు వేదిక వద్ద సెల్ఫీ తీసుకొని రైతు వేదికను కూడా ఫొటో తీసి అప్లోడ్ చేసి హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ఏఈఓలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతు వేదికలో అందుబాటులో ఉండే పరిస్థితులను తీసుకొచ్చింది. ఏఈఓలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ పొలాలను సందర్శించాల్సి ఉంటుంది. ఇలా ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేసే రోజువారీ కార్యక్రమాలను యాప్లో నిక్షిప్తం చేయాలి. ఈ యాప్లో ఏఈఓల హాజరుతోపాటు రైతు వేదికల్లో సమావేశాలు, రైతు బంధు వివరాలు, రైతు బీమా దరఖాస్తుల పరిష్కారం, విత్తనాల అనుమతులు, మట్టి నమూనాలు, ఉత్పాదకాల పంపిణీ, రిజిస్టర్ల నిర్వహణ, ధాన్యం కొనుగోళ్లు, పంట కోత ప్రయోగాలు, గ్రామాల్లో రైతులను కలువడం, పంట నష్ట పరిహారాల పంపిణీ, వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ తరగతులు తదితర 17 అంశాలను నిర్వహిస్తున్నారు. ఈ యాప్ రైతు వేదికల ప్రాంగణం, క్లస్టర్ గ్రామాల్లో మాత్రమే అందుబాటులోకి రానుండడం విశేషం.
ఎంతో ప్రయోజనకారి ఈ యాప్
వ్యవసాయశాఖ రూపొందించిన ఏఈఓ యాప్ రైతులు, అధికారులకు ఎంతో ప్రయోజనకారిగా మారింది. ఉన్నచోటు నుంచే పంటల వివరాలు నమోదు జరుగకుండా పొలాల వద్దకు వెళ్లి చేసేలా ఈ యాప్ రూపొందించారు. అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం పంటల వివరాలు నమోదు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. గతంలో ఏ సర్వే నంబర్లో ఎంత పంట వేశారనే వివరాలతోపాటు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలు, ఏ దశల్లో ఉన్నాయి, చీడపీడలు ఏమైనా ఆశించాయా, పంట ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ చేపడుతున్న పథకాలు, అవగాహన ప్రచారాలు చేపడుతున్నది, లేనిది స్పష్టంగా రాష్ట్ర స్థాయి అధికారులకూ క్షణాల్లో తెలిసిపోతుంది. దీంతో ఏఓ, ఏడీఏ, డీఏఓతోపాటు వ్యవసాయ కమిషనర్ వరకు స్పందించి అప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుంటుంది.
పంటల నమోదు పకడ్బందీగా జరుగుతున్నది
జిల్లాలో పంటల సాగు నమోదు ముమ్మరంగా జరుగుతున్నది. ఏఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి సర్వేనంబర్లోని రైతులందరి పంటల వివరాలను వారి వద్ద ఉన్న సెల్ఫోన్ లేదా ట్యాబ్ల ద్వారా యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. నేను ప్రతిరోజూ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేస్తున్నా. జిల్లాలో ఈ సీజన్లో 6.09 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు 3.95 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఏఈఓలు 3.46 లక్షల ఎకరాల్లో వేసిన పంటలను ఆన్లైన్లో పొందుపర్చారు.
– రామారావునాయక్, సూర్యాపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి