Srisailam | శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని ఆదివారం ఉదయం నుండి డ్యాం ఏడో గేటును 10 అడుగుల వరకు తెరిచి నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా 1,93,488, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 8,838, సుంకేశుల నుండి 43,450 క్యుసెక్కుల నీరు విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం వరకు రిజర్వాయర్కు 2,40,0000 క్యుసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరింది.
అదే విధంగా సాయంత్రం ఏడు గేట్లతో 1,95,559, కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,682, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న సాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వలు 215 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 884.70అడుగుల 213.88 టీఏంసీలుగా ఉన్నాయి.
శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులు గోపూజలు చేసుకునేందుకు వీలుగా శ్రీగోకులం నిర్మిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. మల్లమ్మ దేవాలయం వద్ద సుమారు 40 అడుగుల విస్తీర్ణంలో గుండ్రంగా నిర్మిస్తున్న గోకులాన్ని ఆదివారం ధర్మకర్తలమండలి సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న శ్రీగోకులానికి దాతల సహకారం పూర్తిగా ఉందని చెప్పారు. అదే విధంగా గోకులం నిర్మాణంలో వాస్తును అనుసరిస్తూ పరిసరాల్లో దేవతా వృక్షాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈవో వెంట ధర్మకర్తల మండలి సభ్యులు హనుమంతునాయక్, ప్రత్యేక ఆహ్వానితులు ధర్మరాజు ఉన్నారు.