గువాహటి : గత నెల 21న అపహరించిన ఓఎన్జీసీ ఉద్యోగి రితుల్ సైకియాను యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా) నెల రోజుల తర్వాత విడుదల చేసింది. జోర్హాట్ జిల్లాలోని టైలాబోర్ నివాసి అయిన సైనియాతోపాటు మరో ఇద్దరు అధికారులను శివసాగర్ ప్రాంతంలో ఉల్ఫా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మోన్ జిల్లాలోని ఓ గ్రామంలో సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు అధికారులను సైన్యం, నాగాలాండ్ పోలీసులు రక్షించారు. తాజాగా రితుల్ సైకియాను నాగాలాండ్లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో శనివారం ఉదయం విడుదల చేశారు. దీంతో ఆయన మోన్ జిల్లాలోని అసోం రైఫిల్ పోస్టుకు చేరుకున్నారు. భారత భూభాగంలోకి వచ్చిన తర్వాత నాగాలాండ్ పోలీసులు అతన్ని మోన్ పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు విచారించి ఇంటికి పంపించినట్లు అధికారులు తెలిపారు. సైకియా విడుదలపై సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ప్రతిఒక్కరి సహకారంతో రాష్ట్రంలో శాంతి నెలకొందని, అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్షాకు కృతజ్ఞతలు తెలిపారు.